సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియలో రాజధాని హైదరాబాద్ జిల్లా ఘోరంగా వెనుకబడింది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి ‘సర్ ’ ఫారాలను పంపిణీ చేయడంలో ప్రదర్శించిన నిర్లక్ష్యపు ధోరణిని ఆన్లైన్లో డిజిటలైజ్ చేయడంలోనూ అదే వైఖరిని అవలంభిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటివరకు ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కనీసం 50 శాతం కూడా దాటకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఓటర్లలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఉన్నతాధికారులు రోజువారీ సమీక్షలు నిర్వహిస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతున్నారని, క్షేత్రస్థాయిలో డేటా ఎంట్రీ వేగం పెంచేందుకు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అదనపు సిబ్బందిని కేటాయించి, డిజిటలైజేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ‘బీఎల్ఓలు వచ్చి ఫారాలు ఇచ్చి వెళ్లారు. కానీ వాటిని తిరిగి ఎప్పుడు తీసుకుంటారో.. ఎప్పుడు ఆన్ లైన్ చేస్తారో స్పష్టత లేదు.
గడువు ముగిసిపోతే మా ఓటు హకు గల్లంతవుతుందేమోనని భయంగా ఉంది’ అని నగరానికి చెందిన పలువురు ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 3వ తేదీతో గడువు ముగియనుంది. నిర్ధేశిత గడువుకు ఇంకా కొన్ని రోజులే సమయం ఉండటంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టకపోతే లక్షలాది మంది ఓటర్ల వివరాల నమోదు పెండింగ్లో పడే ప్రమాదం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.