ఖైరతాబాద్, జూలై 22 : జవహర్నగర్ డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 26న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్లోని డీఎన్ఆర్ గార్డెన్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు కమిటీ కన్వీనర్ ఉమా మహేశ్ తెలిపారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.
కమిటీ చైర్మన్ షేక్ షావలీ అధ్యక్షతన జరిగే సదస్సు మొదటి సెషన్లో పర్యావరణవేత్త బాబురావు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫసర్ కాశీం, ఓపీడీఆర్ ఆల్ ఇండియా చైర్మన్ సి. భాస్కర్ రావు, పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్, సీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, హెచ్ఆర్ఎఫ్ నగర కార్యదర్శి సంజీవ్, రెండో సెషన్లో కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, అరుణోదయ జాతీయ నాయకురాలు విమలక్క తదితరులు పాల్గొని ప్రసంగిస్తారని తెలిపారు. అనంతరం సదస్సుకు సంబంధించిన పోస్టర్లను కమిటీ కో కన్వీనర్లు జి. శ్రీనివాస్, సదానందం, అనూరాధ, నర్సింహ, ప్రవీణ్, మల్లేశ్, రాజు, సతీశ్, వెంకటాచారితో కలిసి ఆవిష్కరించారు.