మహారాష్ట్ర రాజకీయాలు ఒక్క సారిగా మలుపు తీసుకున్నాయి. ఇన్ని రోజుల పాటు బీజేపీ వర్సెస్ మహా ఘట్ బంధన్గా ఉన్న రాజకీయాలు.. ఇప్పుడు ఎన్సీపీ అధినేత పవార్ వర్సెస్ రాజ్ థాకరేగా మారిపోయాయి. ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్శలకు దిగడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎన్సీపీ 1999 లో ఏర్పడిందని, అప్పటి నుంచి ఆ పార్టీ కుల రాజకీయాల ప్రాతిపదికగానే నడుస్తోందని మండిపడ్డారు. అప్పటి నుంచే మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ విభజన వచ్చిందని విమర్శించారు. ఇక.. యూపీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి తానెంతో సంతోషపడుతున్నానని రాజ్ థాకరే అన్నారు. మహారాష్ట్రలో కూడా అలాంటి అభివృద్ధే కావాలని, త్వరలోనే అయోధ్యను సందర్శిస్తానని ప్రకటించారు.
రాజ్ థాకరేకి కౌంటర్ ఇచ్చిన ఎన్సీపీ నేత పవార్
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే చేసిన వ్యాఖ్యలను ఎన్సీపీ అధినేత పవార్ ఖండించారు. ఏ ఒక్క సమస్యపై కూడా ఆయన పూర్తిగా దృష్టి సారించరని విమర్శించారు. సంవత్సరానికి మూడు నాలుగు నెలలు సుప్త చేతనావస్థలోకి వెళ్లిపోతారని, ఇదీ ఆయన వ్యవహారమని ఎద్దేవా చేశారు. తాము అందర్నీ ఏకం చేశామని, తమ పార్టీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాజ్ థాకరే ఎన్నో మాటలు మాట్లాడుతారు కానీ.. దేనికీ బద్ధులై వుండరని పవార్ మండిపడ్డారు.
లౌడ్ స్పీకర్లరో హనుమాన్ చాలీసాను ప్లే చేసిన రాజ్ థాకరే
మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన పార్టీ కార్యాలయం బయట లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసాను ప్లే చేశారు. మసీద్ దగ్గర వుండే లౌడ్ స్పీకర్లను వెంటనే ప్రభుత్వం తొలగించాలని, లేదంటే వాటిల్లో హనుమాన్ చాలీసా ప్లే చేయాలని రాజ్ థాకరే సంచలన డిమాండ్ చేశారు. తాము ఎవ్వరి ప్రార్థనలకూ వ్యతిరేకం కాదని, అయితే.. తమ తమ ఇళ్లల్లో ప్రార్థనలు చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.