ఛత్రపతి శంభాజీనగర్, మార్చి 19: మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న బీజేపీ సరికొత్త వ్యూహాలు రచిస్తున్నది. మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్)ను ఎన్డీఏలో చేర్చుకునేందుకు పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్ ఠాక్రేతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చలు జరిపారు. గత ఎన్నికల్లో బీజేపీ – శివసేన కలిసి పోటీ చేసి మహారాష్ట్రలోని 48 లోక్సభ సీట్లకు 41 స్థానాలు గెలుచుకున్నాయి. అయితే, ఈసారి బీజేపీకి కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(శరద్చంద్ర పవార్) పార్టీల కూటమి గట్టి పోటీ ఇస్తున్నది. ముఖ్యంగా శివసేన రెండుగా చీలినప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన(యూబీటీ) మరాఠాల్లో బలమైన రాజకీయ శక్తిగా కొనసాగుతున్నది.