Rahul on Agniveer | కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్నివీర్ ప్రక్రియను రద్దు చేయనున్నట్లు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్మెంట్లో పాత విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అగ్నివీర్ కారణంగా సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలని ఆశగా ఎదురు ఎందరో యువకులు నిరుత్సాహానికి గురయ్యారన్నారు. ఇలాంటి యువతను దృష్టిలో ఉంచుకుని అగ్నివీర్ను పూర్తిగా రద్దు చేయనున్నట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర బుధవారం ఉత్తరప్రదేశ్లోని బాగ్పట్లో కొనసాగుతున్నది. ఉదయం 6.15 గంటలకు మావి కలన్ నుంచి జోడో యాత్రను రాహుల్ ప్రారంభించారు. సిసానా సమీపంలో అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియకు సంబంధించిన దేవీలాల్ చౌదరి సహా ఐదుగురు యువకులు రాహుల్తో దాదాపు 25 నిమిషాల పాటు సంభాషించారు. తాను అగ్నివీర్ రిక్రూట్మెంట్లో తాను ఎంపికయ్యానని, అయితే ఎలాంటి కారణం లేకుండా రిక్రూట్మెంట్ను నిలుపుదల చేశారని రాహుల్ గాంధీ దృష్టికి దేవీలాల్ చైదరి తీసుకొచ్చాడు. అగ్నివీర్ కారణంగా నాలాంటి ఎందరో యువకులు ఎంపికైనప్పటికీ సైన్యంలో చేరలేకపోయారని చెప్పాడు. దీనిపై రాహుల్ కాస్తా తీవ్రంగా స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే అగ్నివీర్ రిక్రూట్మెంట్ ప్రక్రియను రద్దు చేస్తుందని.. పాత విధానంలోనే ఆర్మీ రిక్రూట్మెంట్ జరుపుతామని యువకులకు హామీ ఇచ్చాడు.
భారత్ జోడో యాత్రలో రాలోడ్, పీస్ పార్టీ, భీమ్ ఆర్మీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బాగ్పట్ జిల్లాకు చెందిన దాదాపు 200 మంది భీమ్ ఆర్మీ కార్యకర్తలు రాహుల్ వెంట నడిచారు. షామ్లీలోని యూపీ సరిహద్దు వరకు నడవనున్నట్లు వారు తెలిపారు. యాత్ర బాగ్పట్ చేరుకోగానే ఆర్ఎల్డీ కార్యకర్తలు రాహుల్గాంధీకి ఘనంగా స్వాగతం పలికారు. కాగా, మదీనాలోని మదర్సా ఒసాటియాకు చెందిన సదర్ హజ్రత్ మౌలానా ఒసామా కూడా భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. మన దేశంలో జరుగుతున్న విద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ తీసుకున్న చర్యకు మనమందరం చేయీచేయీ కలుపుదాం అని సదర్ హజ్రత్ మౌలానా ఒసామా చెప్పారు. యూపీలో ఇవాళ రాహుల్ యాత్ర 48 కిలోమీటర్లు కొనసాగనున్నది.