Rahul Gandhi : లడఖ్లో నియంత్రణ రేఖ వెంబడి ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన నిర్మిస్తోందని వస్తున్న వార్తల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ మౌనం దాల్చడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నించారు. సరిహద్దుల్లో చైనా దూకుడు ప్రదర్శిస్తుంటే ప్రధాని మౌనం దాల్చతున్నారని..మన భూభాగం, మన ప్రజలు, మన సరిహద్దులు మెరుగైన కార్యాచరణను కోరుతున్నాయని రాహుల్ ట్వీట్ చేశారు.
నియంత్రణ రేఖకు చేరువగా ప్యాంగాంగ్ సరస్సుపై గత రెండు నెలలుగా చైనా వంతెన నిర్మిస్తోందనే వార్తా కథనాలను రాహుల్ ప్రస్తావించారు. సరస్సు ఉత్తర, దక్షిణ తీరాలను కలుపుతూ డ్రాగన్ ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టిందని ఆ కథనం పేర్కొంది.
తూర్పు లడఖ్ వద్ద చైనా సరిహద్దుల్లో పరిస్ధితిని మోదీ ప్రభుత్వం సమర్ధంగా ఎదుర్కోవడం లేదని రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ గత కొంతకాలంగా పాలక బీజేపీపై విమర్శలు గుప్పిస్తోంది. జనవరి 1న నూతన సంవత్సరం రోజున గాల్వన్ లోయలో చైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఘటనపై కూడా రాహుల్ గాంధీ ప్రధాని మోదీని నిలదీశారు. డ్రాగన్ రెచ్చిపోతుంటే మోదీ మౌనముద్ర దాల్చారని మండిపడ్డారు.