Kiren Rijiju : భారతదేశ అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఓర్వలేకపోతున్నదని కేంద్రమంత్రి (Union Minister) కిరెణ్ రిజిజు (Kiren Rijiju) మండిపడ్డారు. అమెరికా ప్రభుత్వానికి భారత్ తలొగ్గిందని లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశం అభివృద్ధిపథంలో ఉండడాన్ని చూసి కాంగ్రెస్ ఓర్చుకోలేకపోతోందని, అందుకే ఆ పార్టీ నేతలు ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు.
భారత్-అమెరికా దేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకు మాత్రమే మేలు చేసేలా ఉందనేందుకు ఆధారాలు చూపాలని రాహుల్గాంధీకి రిజిజు సవాల్ విసిరారు. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి స్థానానికి తగిన నేత కాంగ్రెస్ పార్టీలో లేకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాహుల్ ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురీపై లోక్సభలో తీవ్ర ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
పార్లమెంట్ హక్కులను ఉల్లంఘిస్తూ.. కేంద్రమంత్రిపై చేసిన ఆరోపణలకుగానూ విపక్ష నేతపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ చేస్తామని రిజిజు హెచ్చరించారు. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పటికీ రాహుల్గాంధీ.. తన ప్రశ్నలకు ఇతరులు చెప్పే సమాధానాలు వినకుండానే సభ నుంచి వెళ్లిపోతారని మండిపడ్డారు. ఒక సభ్యుడు ప్రసంగం చేసిన వెంటనే సభ నుంచి బయటకు వెళ్లకూడదనే నియమం ఉందని, ఈ విషయం ఆయనకు తెలియదా..? అని రిజిజు ప్రశ్నించారు.