న్యూఢిల్లీ : మోదీ సర్కార్ పార్లమెంట్లో విపక్షాల ప్రశ్నలకు బదులిచ్చే తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వం ‘నో డేటా అవాలిబుల్’ (ఎన్డీఏ)గా మారిందని దుయ్యబట్టారు. నో డేటా అవాలిబుల్ (ఎన్డీఏ) ప్రభుత్వం ఆక్సిజన్ లేక ఏ ఒక్కరూ మరణించలేదని, నిరసన వ్యక్తం చేస్తూ రైతులెవరూ మరణించలేదని, స్వస్ధలాలకు వెళుతూ ఏ ఒక్క వలస కూలీ తనువు చాలించలేదని మిమ్మల్ని నమ్మించాలని చూస్తోందని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.
ఏ ఒక్కరూ మూకహత్యకు గురికాలేదని, జర్నలిస్టులెవరినీ అరెస్ట్ చేయలేదని నమ్మబలుకుతోందని చెప్పారు. నో డేటా..నో ఆన్సర్స్..నో అకౌంటబిలిటీగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆక్షేపించారు. కొవిడ్-19తో అంగన్వాడీ కార్మికులు ఎందరు మరణించారనే సమాచారం లేదని, 2014 నుంచి అరెస్టయిన జర్నలిస్టుల వివరాలపైనా అదే తరహాలో పార్లమెంట్ వేదికగా ప్రభుత్వం వెల్లడించిన నేపధ్యంలో రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.