న్యూయార్క్ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా పర్యటనలో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలో బుధవారం భారత సంతతికి చెందిన విద్యావేత్తలు, కార్యకర్తలు, పౌరసమాజ ప్రతినిధులతో మాట్లాడుతూ మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకే అంతా తెలుసని భ్రమించే వారి చేతిలో భారత్ నడుస్తోందని, వారు దేవుడితో కూర్చుని ఆయనకే విశ్వం గురించి వివరిస్తారని మోదీ కూడా అలాంటి వ్యక్తేనని అన్నారు.
మీరు మోదీని దేవుడి పక్కన కూర్చోబెడితే విశ్వం ఎలా పనిచేస్తోందో దేవుడికే చెబుతాడు. దీంతో తానేం సృష్టించానని దేవుడు గందరగోళానికి గురవుతాడని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రతి విషయం గురించి వివరించగల వారున్నారని, వారు సైంటిస్టులకు సైన్స్ గురించి, చరిత్రకారులకు చరిత్ర గురించి, సైన్యానికి యుద్ధం గురించి చెబుతారని అన్నారు. మిడిమిడి జ్ఞానం కలిగిన వీరంతా ఏ విషయాన్ని అర్ధం చేసుకోలేరని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు, ఏజెన్సీలను పాలకులు దుర్వినియోగం చేస్తుండటంతో దిక్కుతోచని స్ధితిలో భారత్ జోడో యాత్రను చేపట్టానని గుర్తుచేశారు. తన యాత్రను నిలిపివేసేందుకు ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా తమ స్ఫూర్తి మరింత ఇనుమడించిందని అన్నారు.
అన్ని మతాలు, వర్గాల ప్రజల విశ్వాసాలను కాంగ్రెస్ విశ్వసించి, గౌరవిస్తుందని ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తుందని చెప్పారు. ఈ విలువలను అంగీకరించకుండా ఉంటే మీరు ఇక్కడ ఉండేవారు కాదని, మీరు విద్వేషం, అసహనం, అహంకారం కలిగిన వారైతే మీరు బీజేపీ సమావేశంలో కూర్చుండేవారని, తాను మన్ కీ బాత్లో బిజీగా ఉండేవాడినని రాహుల్ పేర్కొన్నారు. దేశ పురోభివృద్ధికి కులగణన కీలకమని, కానీ బీజేపీ కుల గణన వివరాలను బీజేపీ వెల్లడించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళితులు, గిరిజనులు, ముస్లింలను సమాదరిస్తామని స్పష్టం చేశారు. భారత్ను సమానత్వానికి, జీవించేందుకు అనువైన ప్రదేశంగా మారుస్తామని పేర్కొన్నారు.
Read More