న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తనకు అత్యంత సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు లబ్ధి చేకూర్చేందుకే ఇంధన ధరలను తగ్గించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్లోని గురుదాస్పూర్లో సోమవారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని అయినా ఇంధన ధరలను మోదీ సర్కార్ తగ్గించడం లేదని దుయ్యబట్టారు. తమ హయాంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్కు ఏకంగా 140 డాలర్లకు ఎగబాకగా ఇప్పుడవి బ్యారెల్కు 90 డాలర్లకు దిగివచ్చాయని అన్నారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా దేశంలో మత్రం ఇవి తగ్గకపోగా మరింత భారమవుతున్నాయని రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. చమరు ధరల నుంచి తన ఇద్దరు పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు దోచిపెట్టేందుకే మోదీ ఇంధన ధరలను తగ్గించడం లేదని దుయ్యబట్టారు. నోట్ల రద్దు, నిరుద్యోగం వంటి అంశాలపైనా మోదీ సర్కార్ తీరును రాహుల్ తప్పుపట్టారు. 2016లో నోట్ల రద్దు సమయంలో నల్ల ధనంపై పోరాటం చేస్తున్నామని మోదీ తన నిర్ణయాన్ని సమర్ధించుకున్నారని అన్నారు.
రెండు కోట్ల మంది యువతకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారని మీలో ఏ ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ఇప్పుడు బ్లాక్ మనీ గురించి, నిరుద్యోగ సమస్య గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆయన నిలదీశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతన్నలను రాహుల్ అభినందించారు. అన్నదాతల ఆందోళనలకు తమ పార్టీ అండగా నిలిచిందని గుర్తుచేశారు. రైతులు గట్టిగా నిలబడి పోరాడని పక్షంలో సాగు చట్టాలు రద్దయ్యేవి కాదని అన్నారు. తమ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని, అందుకే పార్లమెంట్ వేదికగా నల్లచట్టాలపై పోరాడామని గుర్తుచేశారు.
ఇక పంజాబ్లో ఒకే దశలో ఈనెల 20న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మరోసారి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతతో అందలం ఎక్కాలని ఆప్ పావులు కదుపుతోంది. ఇక ప్రధాన పార్టీలకు దీటుగా పోటీ ఇచ్చేందుకు అకాలీదళ్ సన్నద్ధమవుతుండగా, కెప్టెన్ సింగ్ సారధ్యంలోని పీఎల్సీతో జట్టుకట్టిన కాషాయ పార్టీ పంజాబ్ పోరులో సత్తా చాటాలని యోచిస్తోంది.