న్యూఢిల్లీ : మాజీ సైనికోద్యోగులకు తక్షణమే పెన్షన్ చెల్లించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మోదీ సర్కార్ను కోరారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ తర్వాత ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఆల్ ర్యాంక్..నో పెన్షన్ విధానాన్ని అనుసరిస్తోందని రాహుల్ బుధవారం ట్వీట్ చేశారు. సైనికులను అవమానించడం దేశానికి అవమానకరమని అన్నారు. మాజీ సైనికులకు వీలైనంత త్వరగా ప్రభుత్వం పెన్షన్ చెల్లించాలని కోరారు.
ఏప్రిల్ నెల పెన్షన్ ఇంతవరకూ తమకు రాలేదని, దీనిపై అధికారులు ఎలాంటి వివరణ ఇవ్వలేదని కొందరు రక్షణ శాఖ మాజీ ఉద్యోగులు పేర్కొన్నారు. ఏప్రిల్ 29, 30 తేదీల్లో తమ పెన్షన్ క్రెడిట్ కాలేదని తామింకా పెన్షన్ కోసం వేచిచూస్తున్నామని వారు వెల్లడించారు. ఎలాంటి వివరణ లేకుండా పెన్షన్ నిలిపివేశారని మాజీ సైనికోద్యోగులు ఫిర్యాదు చేస్తున్నారని, వారికి ఇదే జీవనాధారమని లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హుదా (రిటైర్డ్) ట్వీట్ చేశారు.
అంతకుముందు ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రతినిధి రణ్దీప్ సుర్జీవాలా ట్వీట్ చేశారు. సాయుధ దళాలపై ప్రభుత్వం చేస్తున్న దాడి ఇది తొలిసారి కాదని చివరి సారి కూడా కాదని దుయ్యబట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విధానంలో లోపాలతో పాటు, డిజేబిలిటీ పెన్షన్పై పన్ను విధించడం, ఈసీహెచ్ఎస్ బడ్జెట్లో కోత వంటి సైనికోద్యోగుల వ్యతిరేక చర్యలు చేపట్టిందని విమర్శించారు.