Rahul Gandhi : నియంతృత్వ పోకడలతో చెలరేగే ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. జమ్ములో గురువారం జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్, ఆరెస్సెస్ మధ్య సైద్ధాంతిక పోరాటం సాగుతున్నదని, మీరు మా పక్షాన నిలిచారని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ అన్నారు.
తాను పార్లమెంట్లో కూర్చుండగా మోదీని చూశానని, మీరు ఆయన విశ్వాసాన్ని మటుమాయం చేశారని తాను చెప్పగలనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని మోదీకి మానసికంగా ఎంత టెన్షన్ ఇచ్చారంటే ఆయన సైకాలజీ పతనమైందని వ్యాఖ్యానించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ కార్యకర్తలను కోరారు.
కాగా, జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ఖర్గే అంతకుముందు శ్రీనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ జమ్ము కశ్మీర్లో మనం విజయం సాధిస్తే దేశమంతా మన నియంత్రణలోకి వస్తుందని అన్నారు. జమ్ము కశ్మీర్తో రాహుల్ గాంధీ అనుబంధం రక్తసంబంధమని ఖర్గే చెప్పుకొచ్చారు.
Read More :
Hyderabad | రాత్రిపూట మహిళలకు ఉచిత రవాణా.. హైదరాబాద్ పోలీసుల వివరణ ఇదీ..!