న్యూఢిల్లీ : పాలక బీజేపీ దేశంలో వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజల గొంతుకగా విపక్షాలు మోదీ సర్కార్కు వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావాలని కోరారు. లండన్లో ఐడియాస్ ఫర్ ఇండియా సదస్సులో రాహుల్ మాట్లాడారు. దేశమంతటా బీజేపీ కిరోసిన్ పోసిందని, అగ్గి రాజేస్తే పెను సంక్షోభానికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగంపై మోదీ సర్కార్ దాడికి తెగబడుతోందని ఆరోపించారు.
ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలు, రాష్ట్రాలు, మతాలను ఏకం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. బీజేపీ చేపడుతున్న చర్యలతో వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరచాలని లేకుంటే పరిస్ధితులు చేయిదాటతాయని హెచ్చరించారు. బ్రిడ్జి ఇండియా నిర్వహించిన ఈ సదస్సులో రాహుల్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను నులిమివేస్తున్నారని, తాము ప్రజల ఆవేదనను వింటున్నామని చెప్పుకొచ్చారు. దే
శ ప్రజల గొంతుకను విని వారి సమస్యలను ప్రముఖంగా ప్రస్తావిస్తున్నామని అన్నారు. ప్రధాని తరచుగా తాను ప్రజల గళాన్ని వింటానని చెప్పుకుంటారు కానీ ఆయన ప్రజల వాణిని వినిపించుకోరని రాహుల్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ తరచూ ఓటమి పాలవడాన్ని ప్రస్తావిస్తూ ఎన్నికల్లో పాలక పార్టీ విజయాలకు ప్రజల్లో చీలిక తీసుకురావడం, మీడియాను గుప్పిట్లో పెట్టుకోవడమే కారణమని అన్నారు. ఆరెస్సెస్కు ఉన్న నిర్మాణం కూడా ఆ పార్టీకి కలిసివస్తోందని, విపక్షాలు, కాంగ్రెస్ కూడా అలాంటి వ్యవస్ధను నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు.