న్యూఢిల్లీ : బిల్కిస్ బానో (Bilkis Bano Case) లైంగిక దాడి కేసులో 11 మంది దోషులను విడుదల చేయాలని గుజరాత్ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. గుజరాత్ ప్రభుత్వానికి క్షమాభిక్ష ప్రసాదించే అధికారం లేదని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్ధానం తీర్పును విపక్ష పార్టీలు స్వాగతించాయి. ఇది న్యాయం సాధించిన విజయమని వ్యాఖ్యానించిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
నేరస్తులను కాపాడేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను రాహుల్ ఎండగట్టారు. అహంకారపూరిత బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిల్కిస్ బానో చేసిన సుదీర్ఘ పోరాటానికి ఫలితంగా న్యాయం గెలిచిందనేందుకు ఈ తీర్పు సంకేతమని రాహుల్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు న్యాయానికి పాతరేయడం ప్రజాస్వామిక వ్యవస్ధలో ప్రమాదకర పోకడని వ్యాఖ్యానించారు.
నేరగాళ్లను పోషిస్తున్నదెవరో సుప్రీంకోర్టు నిర్ణయం మరోసారి దేశానికి చాటిచెప్పిందని రాహుల్ పేర్కొన్నారు. చివరికి న్యాయం నెగ్గిందని సుప్రీం తీర్పును స్వాగతిస్తూ కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో న్యాయ వ్యవస్ధ పట్ల ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగిందని, బిల్కిస్ బానో పోరాటం కొనసాగించినందుకు అభినందనలని ప్రియాంక సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
Read More :
Drug Addict | ప్రపంచ కుబేరుడైనా డ్రగ్స్కు బానిసే.. అతనెవరంటే?