గువహటి : అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం అసోంలో పర్యటించాల్సి ఉండగా వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన రద్దయింది. ప్రతికూల వాతావరణంతో పర్యటన రద్దు చేసుకున్న రాహుల్ అసోంలో మహా కూటమికి ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ ఓ వీడియోను విడుదల చేశారు.
అసోంను తాము అభివృద్ధి పధంలోకి తీసుకువెళతామని, రాష్ట్ర పురోగతికి మహా కూటమిని భారీ మెజారిటీతో గెలిపించాలని వీడియోలో రాహుల్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇక షెడ్యూల్ ప్రకారం రాహుల్ మంగళవారం సిల్చార్లో మహిళలతో భేటీ కావడంతో పాటు హఫ్లాంగ్, కర్బి అంగ్లాంగ్ జిల్లాలో ప్రచార ర్యాలీలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది.