న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో పాటు సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రైతులకు ఎంతో మేలు చేశామంటున్నారని, మరి రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారని కేంద్రాన్ని నిలదీశారు. రైతు ఉద్యమాలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రైతుల శక్తి ముందు ప్రభుత్వం తలవంచిందని, సాగుచట్టాల అంశంలో రైతులు ఐక్యంగా పోరాడారన్నారు. ఉపాధి బడా వ్యాపారులు కాదని.. నిరుద్యోగు యువతకు కావాలన్నారు. అన్ని రకాల ధరలు పెరిగాయనన్న రాహుల్.. గ్యాస్ పెట్రోల్, వంటనూనె, పాల ధరలు విపరీతంగా పెరిగాయని ఆవేదన వ్యక్తంచేశారు.
నిరుద్యోగం, ధరల పెరుగుదలతో ప్రజలను ఇబ్బందిపెట్టారని ఆరోపించారు. 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఏం చేసిందని అంటున్నారని.. ఈ రకంగా ధరల పెరుగుదల ఎన్నడూ లేదన్నారు. ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించనీయడం లేదని, పార్లమెంట్లో విపక్షాలను నోరెత్తనీయడం లేదని ధ్వజమెత్తారు. మీడియా సైతం ప్రజల పక్షాన లేదన్నారు. ప్రజల గొంతుకగా ఉండాల్సిన మీడియా తన పాత్ర పోషించడం లేదని, మీడియా ప్రస్తుతం ఇద్దరి పారిశ్రామికవేత్తల చేతుల్లోనే ఉందన్నారు. పార్లమెంట్లో నోరెత్తనీయట్లేదు.. మీడియా చూపించట్లేదన్నారు. ప్రతిపక్ష నాయకులపై ఈడీ, సీబీఐలను ఉసిగొల్పుతున్నారన్న రాహుల్, ఈడీ కార్యాలయంలో తనను 55గంటల పాటు కూర్చుండబెట్టారన్నారు. ఎన్ని గంటలు కూర్చుండబెట్టినా తాను.. ఈడీకి, మోదీకి భయపడనని రాహుల్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం దేశాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్క భారతీయుడి బాధ్యతన్నారు. ఈ రోజు మనం నిలబడకపోతే దేశానికే మనుగడ లేదన్నారు. ఈ దేశమే ప్రజల భవిష్యత్ అని, ఈ దేశం ఇద్దరు పారిశ్రామికవేత్తలకు చెందింది కాదన్నారు. ఇద్దరు పారిశ్రామికవేత్తల కోసం నరేంద్ర మోదీ కూడా 24 గంటలు పనిచేస్తున్నారు. నరేంద్ర మోదీ జీ ప్రధానమంత్రి, కానీ ఆ ఇద్దరు పారిశ్రామికవేత్తలు లేకుండా నరేంద్ర మోదీ ప్రధాని కాలేరన్నారు. దేశంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేదని, చదివేందుకు నాణ్యమైన విద్య కూడా అందించడం లేదని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధి అంటే పారిశ్రామికవేత్తలది కాదని, ప్రజల అభివృద్ధి అన్నారు.
యూపీఏ, మోదీ హయానికి తేడా తెలుసుకోవాలని.. సన్న, చిన్నకారు రైతులు, చిరువ్యాపారులను అడిగితే తేడా ఏంటో తెలుస్తుందని చురకలంటించారు. పేదలకు ఉపాధి కల్పించేందుకు యూపీఏ నరేగాను తీసుకొచ్చిందని, ప్రస్తుతం యూపీఏ నాటి ఉపాధి హామీ అమలుకావడం లేదన్నారు. యూపీఏ హయాంలో కోట్లమందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చామని, నరేంద్ర మోదీ కాలంలో పేదలు ఇంకా నిరుపేదలయ్యారని, 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఇప్పుడు ఉందన్నారు. ప్రజలు ఇప్పటికైనా మేల్కోవాలని, లేదంటే దేశం నాశనమవుతుందన్నారు. కాంగ్రెస్తో పాటు మిత్రపక్షాలతో కలిసి బీజేపీ, ఆర్ఎస్ఎస్ను నిలువరిస్తామన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ నేతలు దేశాన్ని విభజించి ఉద్దేశపూర్వకంగానే దేశంలో భయాందోళనలు సృష్టిస్తున్నారని రాహుల్ మండిపడ్డారు.