న్యూఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) బ్రిటన్ వేదికగా మరోసారి బీజేపీ, మోదీ సర్కార్లపై విమర్శలు గుప్పించారు. కేంబ్రిడ్జి వర్సిటీ ప్రసంగంలో మోదీ సర్కార్పై విరుచుకుపడిన రాహుల్ తాజాగా లండన్లో భారత జర్నలిస్ట్స్ అసోసియేషన్ (ఐజేఏ) ప్రతినిధులతో ముచ్చటిస్తూ మరోసారి పదునైన విమర్శలు చేశారు. గత తొమ్మిదేండ్లుగా మోదీ ప్రభుత్వ విధానాలతో ఏకీభవించని జర్నలిస్టులపై దాడులు, అణిచివేత పెచ్చుమీరిందని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. బీబీసీ కార్యాలయాలపై ఇటీవల జరిగిన పన్ను అధికారుల సోదాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మోదీ సర్కార్ దేశ సంపదను ముగ్గురు, నలుగురు బడా సంపన్నులకు దోచిపెడుతుంటే దళితులు, వెనుకబడిన కులాల వారు మౌనం దాల్చాలని కాషాయ పాలకులు కోరుకుంటున్నారని రాహుల్ విమర్శించారు. పేదల ప్రయోజనాలను పణంగా పెడుతూ సంపన్న పారిశ్రామికవేత్తలకు మోదీ సాయపడుతున్నారని ఆరోపించారు. కాగా, అంతకుముందు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రసంగంలోనూ మోదీ సర్కార్ లక్ష్యంగా రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్ధపై దాడి జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో శుక్రవారం ఉపన్యసించిన రాహుల్ ప్రజాస్వామ్య పరిరక్షణకు అవసరమైన వ్యవస్ధలు నిర్భందానికి లోనవుతున్నాయని వ్యాఖ్యానించారు.
తనపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ వాడుతోందని అన్నారు. 21వ శతాబ్ధంలో బోధనలు అనే అంశంపై వర్సిటీ విద్యార్ధులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. భారత ప్రజాస్వామ్యంపై దాడిని నిలువరించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ పేర్కొన్నారు. విపక్ష నేతలపై నిఘా కోసం ప్రభుత్వం పెగాసస్ను వినియోగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన ఫోన్పైనా పెగాసస్తో నిఘా పెట్టారని వివరించారు. తనతో సహా విపక్ష నేతలపై ఫోన్లపై నిఘా పెట్టారని, తాను ఫోన్లో మాట్లాడేసమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.
మీడియా, న్యాయవ్యవస్ధను ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని మైనారిటీలు, దళితులు, గిరిజనులపై దాడులతో చెలరేగుతూ అసమ్మతిని అణిచివేస్తోందని దుయ్యబట్టారు. వారం రోజుల బ్రిటన్ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ బిగ్ డేటా, ప్రజాస్వామ్యం, భారత్ -చైనా సంబంధాలపై జరిగే పలు సెషన్స్లో పాల్గొంటారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ బ్రిటన్ చాప్టర్ ప్రతినిధులతో సంప్రదింపులు జరపడంతో పాటు వారాంతంలో లండన్లో జరిగే భారత సంతతికి చెందిన వారితో సమావేశమవుతారు.
Read More :