China Defence Budget | డ్రాగన్ కంట్రీ చైనా (China) రక్షణ బడ్జెట్ (Defence Budget)ను భారీగా పెంచింది. గత ఏడాది కంటే 1.55 ట్రిలియన్ యువాన్ల (సుమారు 224 బిలియన్ డాలర్లు)కు పెంచింది. సైనిక వ్యయాన్ని పెంచడం వరుసగా ఇది ఎనిమిదోసారి. గతేడాది రక్షణ బడ్జెట్కు 1.45 ట్రిలియన్స్ యువాన్లు కేటాయించింది. ఈ ఏడాది వ్యయాన్ని 1.55 ట్రిలియన్ యువాన్లకు పెంచింది. గతేడాదితో పోలిస్తే 7.1శాతం పెరుగుదల నమోదైంది. అయితే, యువాన్తో పోలిస్తే డాలర్ విలువ పెరిగిన దృష్ట్యా డ్రాగన్ దేశం ఈ ఏడాది రక్షణ వ్యవయాన్ని 224 బిలియన్ డాలర్లకు పెంచినట్లుగా అంచనా వేస్తున్నారు.
అయితే, చైనా ఆర్థిక వృద్ధిరేటు కంటే రక్షణ రంగం బడ్జెట్ అధికంగా ఉండడం గమనించదగ్గ విషయం. 2027 పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లక్ష్యాలపై దృష్టి సారించిన చైనా.. సాయుధ దళాలు, సైనిక కార్యకలాపాలను నిర్వహించేందుకు, సంసిద్ధతను పెంచేందుకు, సైనిక సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు పని చేయాలని ప్రీమియర్ లి క్వికియాంగ్ పిలుపునిచ్చారు. సాయుధ దళాలు బోర్డు అంతటా సైనిక శిక్షణ, సంసిద్ధతను తీవ్రతరం చేయాలని, కొత్త సైనిక వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అభివృద్ధి చేయాలని, పోరాట పరిస్థితులలో శిక్షణ కోసం ఎక్కువ శక్తిని వెచ్చించాలి, అన్ని దిశలు, డొమైన్లలో సైనిక బలగాలను బలోపేతం చేయడానికి సమన్వయంతో కృషి చేయాలి అని జాతినుద్దేశించి ప్రసంగంలో లీ సూచించారు.
అమెరికా తర్వాత రక్షణ కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్న రెండో దేశంగా చైనా నిలిచింది. 2023లో అమెరికా రక్షణ రంగానికి 816 బిలియన్లు కేటాయించగా.. చైనా 224 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నది. భారతదేశాని కంటే దాదాపు మూడు రెట్లు రక్షణకు చైనా నిధులు కేటాయిస్తున్నది. 2023-24లో భారత రట్న బడ్జెట్ రూ.5.94లక్షల కోట్లు (దాదాపు 72.6 బిలియన్ డాలర్లు). ఎప్పటికప్పుడు బడ్జెట్ను పెంచుకుంటూ వస్తున్న చైనా.. ప్రపంచంలోనే అత్యధికంగా సైనికులు కలిగిన దేశంగా నిలిచింది. దాదాపు రెండు మిలియన్ల పీఎల్ఏ, ఆర్మీ, నేవీ, వైమానిక దళ బలగాలున్నాయి. వీటిని ఎప్పటికప్పుడు విస్తరించడంతోపాటు ఆధునికీకరిస్తూ శక్తివంతమైన దేశంగా నిలుస్తున్నది.
పీపుల్స్ లిబరేషన్ హైకమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ చైర్మన్గా ప్రెసిడెంట్ జిన్పింగ్ నాయకత్వం వహిస్తున్నారు. జిన్పింగ్ నాయకత్వంలో చైనా సైన్యం రాబోయే కొద్ది సంవత్సరాల్లో అమెరికా సాయుధ దళాలతో సమానంగా ఉండాలనే లక్ష్యంతో భారీగా సైనిక ఆధునికీకరణను ప్రారంభించింది. ఇదిలా ఉండగా.. ఇటీవల తైవాల్లో అమెరికా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్నట్లు వస్తున్న వార్తలపై చైనా కలవరానికి గురవుతున్నది. తైవాన్ జలసంధిలో అగ్రరాజ్య నౌకాదళం, వాయుసేనలు గస్తీలను ముమ్మరం చేయడం ఇబ్బందికరంగా చైనా భావిస్తున్నది. గతేడాది ఆగస్టులో అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ ఫెలోసీ తైవాన్లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటన అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చైనా తైవాన్కు సరిహద్దుల్లో పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.