న్యూఢిల్లీ : దేశంలో విపక్షాల గొంతునొక్కుతున్న మోదీ సర్కార్ అణిచివేత వైఖరితో నిరంకుశంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యసభలో బుధవారం ఎంపీల పట్ల ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. దేశాన్ని తెగనమ్ముతున్న మోదీ ప్రభుత్వంపై గొంతెత్తిన వారిని వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
పార్లమెంట్లో ప్రభుత్వం తమను మాట్లాడనీయలేదని ఆరోపిస్తూ విపక్ష ఎంపీలు గురువారం నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతకుముందు బుధవారం రాజ్యసభలో జరిగిన పరిణామాలపై చర్చించేందుకు విపక్ష నేతలు రాజ్యసభలో ప్రతిపక్ష నేత చాంబర్లో సమావేశమయ్యారు. పెగాసస్ వివాదం, వ్యవసాయ చట్టాలపై విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ ఉభయసభలూ షెడ్యూల్కు ముందే నిరవధికంగా వాయిదా పడ్డాయి.
మరోవైపు పార్లమెంట్లో విపక్ష సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం లేని పరిస్ధితి నెలకొందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. బుధవారం మహిళా ఎంపీల పట్ల దురుసుగా వ్యవహరించిన ఘటన ప్రజాస్వామ్యానికి మచ్చని వ్యాఖ్యానించారు.