పనాజీ : అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు పార్టీలు మారుతున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో కాంగ్రెస్ పార్టీని వీడిన ఎమ్మెల్యే అలిక్సో లౌరెన్కో మంగళవారం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీల సమక్షంలో తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. లౌరెన్కో రాకతో పార్టీ నూతన జవసత్త్వాలు నింపుకుంటుందని టీఎంసీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
గోవా అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పట్టుదలతో ఉన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్వయంగా పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తోంది. మరోవైపు పంజాబ్ మాజీ మంత్రి, గురుహర్సహై ఎమ్మెల్యే రాణా గుర్మీత్ సోధి కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్, భూపీందర్ యాదవ్ల సమక్షంలో బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర భద్రత, మత సామరస్యాన్ని పణంగా పెడుతున్నందునే తాను ఆ పార్టీని వీడానని, కాంగ్రెస్ పార్టీకున్న లౌకిక ప్రతిష్ట పూర్తిగా దెబ్బతిన్నదని గుర్మీత్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత పోరు పంజాబ్ను ప్రమాదకర పరిస్ధితుల్లో పడేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.