చండీగఢ్: పంజాబ్లో రైతుల నిరసన (farmers protest) నాల్గవ రోజుకు చేరింది. శనివారం కూడా పాటియాలా జిల్లాలోని శంభు రైల్వే స్టేషన్లో రైలు పట్టాలపై రైతులు బైఠాయించారు. ఈ నేపథ్యంలో అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైతుల ఆందోళన సందర్భంగా హర్యానా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం నుంచి నిరసన చేపట్టారు. పంజాబ్, హర్యానా సరిహద్దు సమీపంలోని శంభులో అంబాలా-లూథియానా-అమృత్సర్ మార్గంలో రైలు పట్టాలపై బైఠాయించారు. అరెస్ట్ చేసిన ముగ్గురు రైతులను విడుదల చేసే వరకు తమ నిరసన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు.
కాగా, రైతుల నిరసనల వల్ల మూడు రోజుల్లో 380 రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిందని రైల్వే అధికారులు తెలిపారు. శనివారం అంబాలా-అమృత్సర్ మార్గంలో 54 రైళ్లను రద్దు చేసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురైనట్లు వెల్లడించారు.