(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ రైతు వ్యతిరేక వైఖరి మరోసారి బయటపడింది. అకాల వర్షాలు, వడగండ్ల వాన లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన గోధుమ పంటకు పరిహారం ఇచ్చి రైతులను ఆదుకోవాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా పండిన అరకొర పంటకు కూడా కనీస మద్దతు ధరలో క్వింటాల్కు రూ.31.87 కోత పెట్టింది. ఈ నిర్ణయంపై పంజాబ్, చండీగఢ్ రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. అకాల వర్షాల వల్ల గోధుమల నాణ్యత దెబ్బతినడం, పెరిగిన తేమ వల్ల గింజలు విరగడం వంటి నష్టానికి పరిహారం ప్రకటించకుండా గోధుమల ఎమ్మెస్పీని తగ్గించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యం లో ఎమ్మెల్సీ తగ్గింపుపై రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం భారీ ఆందోళనలు చేపట్టనున్నట్టు పంజాబ్ రైతు సంఘాలు ప్రకటించాయి.
అకాల వర్షాలకు రైతులదా బాధ్యత?
దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో మార్చి 18 నుంచి అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురిశాయి. పంజాబ్, చండీగఢ్, హర్యానాలో ముఖ్యమైన పంటగా ఉన్న గోధుమ దెబ్బతినటంతో రైతులు నష్టపోయారు. అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టాలకు పరిహారానికి ఉద్దేశించిన విపత్తు నిర్వహణ నిధుల నుండి రైతులకు ఇంతవరకు చిల్లిగవ్వ ప్రకటించలేదు సరికదా, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గోధుమలకు ఇస్తున్న ఎమ్మెస్పీ రూ.2,125లో రూ.31.87 కోతపెడుతూ ఆదేశాలు జారీ చేయడంపై రైతులు ఆగ్రహం చేస్తున్నారు. అకాల వర్షాలకు రైతులను బాధ్యులను చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై వారు మండిపడుతున్నారు.
వర్షాలతో తగ్గిన దిగుబడి
పంజాబ్లో గత ఏడాది 14.8 మిలియన్ టన్నుల గోధుమలు దిగుబడి రాగా, ఈ ఏడాది 17.2 మిలియన్ టన్నులకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అకాల వర్షాలతో పంట నష్టం వల్ల ఈ ఏడాది దిగుబడి 16 మిలియన్ టన్నులు ఉంటుందని అధికారులు అంచనాలను తగ్గించారు. అయితే రెండు రోజుల్లో అంచనాలు కొలిక్కి వస్తాయని ప్రకటించారు. రైతులు మాత్రం ఎకరాకు 22 క్వింటాళ్ల గోధుమల దిగుమతి అకాల వర్షాల వల్ల 12 క్వింటాళ్లకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కక్ష సాధింపు చర్యనే..
మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదికి పైగా చేసిన ఆందోళనపై కక్షగట్టి కేంద్రప్రభుత్వం గోధుమ ఎమ్మెస్పీలో కోత విధించిందని సంయుక్త కిసాన్ మోర్చా ఆరోపించింది. గోధుమ పంట నష్టాన్ని అడ్డుపెట్టుకుని, నాణ్యతను సాకుగా చూపి పంజాబ్, హర్యానా, చండీగఢ్ తదితర ప్రాంతాల రైతులను ఆర్థికంగా నష్టపరచాలని కేంద్రం కుట్ర పన్నిందని ఓ ప్రకటలో పేర్కొన్నది. ఇది ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వ ప్రతీకార చర్య అని ఎస్కేఎం అభిప్రాయపడింది.
రైతుల గాయాలపై ఉప్పు చల్లినట్టే
ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే ఆదుకోకపోగా, ఇలా మద్దతు ధరలో కోత విధించడం.. అసలే నష్టపోయిన రైతుల గాయాలపై ఉప్పు చల్లినట్టే. కేంద్రం నిర్ణ యం వెనక్కి తీసుకోవాలి. లేకుంటే ఆందోళనలను ఉద్ధృతం చేస్తాం.
– జగ్మోహన్ సింగ్, రైతు సంఘం నేత
మరోసారి రైతు ఉద్యమం
అకాల వర్షాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. కేంద్రం గుట్టుగా మద్దతు ధరలో కోత పెట్టి రైతులకు ద్రోహం చేసింది. పంట నష్టపోయిన ఉత్తర భారత రాష్ర్టాల రైతులకు కేంద్రం వెంటనే ప్యాకేజీ ప్రకటించాలి. లేకుంటే మరో రైతాంగ మహోద్యమం చేస్తాం.
– బల్జీత్ సింగ్, ఏఐకేఎస్ నేత