పలు రాష్ర్టాల్లో విద్యుత్తు సంక్షోభం
పంజాబ్లో రైతుల నిరసనలు
కోల్కతా, ఏప్రిల్ 27: పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ్గ స్థాయిలో విద్యుదుత్పత్తి జరగడం లేదు. అనేక రాష్ర్టాల్లో కరెంటు కోతలు ఎక్కువయ్యాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కరెంటు కోతలకు వ్యతిరేకంగా పంజాబ్లోని హోషియార్పూర్లో రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
రోడ్లపై బైఠాయించారు. డిమాండ్కు తగినట్టు విద్యుత్తు సరఫరా చేయలేకపోతున్నామని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ అంగీకరించారు. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొనుగోలుకు అదనపు నిధులను విడుదల చేశామని, అయినా కొనుగోలు కష్టంగా ఉందని తెలిపారు. విద్యుత్తుకు గరిష్ఠ డిమాండ్ ఉండే సాయంత్రం వేళ పరిశ్రమలకు, వ్యవసాయానికి విద్యుత్ సరఫరాపై వారం పాటు ఆంక్షలు విధించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది. ఒడిశాలో గరిష్ఠ డిమాండ్ 5,200 మెగావాట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్నది 4,800 మెగావాట్లు మాత్రమే. బీహార్లో విద్యుత్తుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని, రోజూ 200-300 మెగావాట్ల లోటు ఉందని అధికారులు చెప్పారు.