న్యూఢిల్లీ : ఆమ్ ఆద్మీ (ఆప్) పార్టీ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్పై పరువు నష్టం దావా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అనుమతి కోరానని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పేర్కొన్నారు. తనను నిజాయితీలేని వ్యక్తిగా అభివర్ణించిన కేజ్రీవాల్పై న్యాయపరమైన చర్యలకు దిగుతానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ సహా పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేపట్టిన నేపధ్యంలో కేజ్రీవాల్ పంజాబ్ సీఎంపై ఈ వ్యాఖ్యలు చేశారు.
కేజ్రీవాల్ తన హద్దులు మీరి వ్యాఖ్యానిస్తుందున ఆయనపై త్వరలో తాను పరువు నష్టం దావా వేస్తానని చన్నీ చెప్పారు. ఇతరుల ప్రతిష్టను దెబ్బతీసే ఉద్దేశంతో ఆరోపణలు గుప్పించడం ఢిల్లీ సీఎంకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. కేజ్రీవాల్ గతంలోనూ ఇలాగే వ్యవహరించి ఆపై తన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరడం మనం చూశామని చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు పలువురు నేతలపై ఆరోపణలు గుప్పించి ఆపై పారిపోయాడని, ఈసారి ఆయన తప్పించుకోలేడని, కేజ్రీవాల్పై తాను పరువునష్టం దావా వేస్తానని చన్నీ పునరుద్ఘాటించారు.
కాగా కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హనీపై జరిగిన దాడుల్లో ఈడీ రూ 10 కోట్ల నగదు, రూ 21 లక్షల విలువైన బంగారం, రూ 12 లక్షల విలువైన రోలెక్స్ వాచ్ను స్వాధీనం చేసుకుంది. ప్రధాని మోదీ పంజాబ్ టూర్లో ఎదురైన చేదు అనుభవానికి ప్రతీకారంగానే ఈడీ దాడులు చేపట్టారని సీఎం చన్నీ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అణిచివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, కానీ పంజాబ్ ఈ ప్రయత్నాలను తిప్పికొడుతుందని అన్నారు. ఇక ఫిబ్రవరి 20న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.