న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ శివారులోని సింఘు సరిహద్దు వద్ద నిరసన చేస్తున్న ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పంజాబ్లోని ఫతేఘర్ సాహిబ్కు చెందిన 45 ఏండ్ల రైతు గత కొన్ని నెలలుగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్నాడు. 15 రోజులుగా సింఘు సరిహద్దు సమీపంలోని సుశాంత్ సిటీ వద్ద ట్రాక్టర్ ట్రాలీలో ఆయన ఒంటరిగా ఉంటున్నాడు. అయితే బుధవారం తెల్లవారుజామున సమీపంలోని ఒక చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్మార్టమ్ కోసం ఆ రైతు మృతదేహాన్ని సోనేపట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.
కాగా, ఆత్మహత్య చేసుకున్న రైతుకు భారతి కిసాన్ యూనియన్కు చెందిన క్రాంతికారి విభాగంతో అనుబంధం ఉన్నదని సన్నిహిత రైతు నిర్మల్ సింగ్ తెలిపారు. ఆయనకు ఐదెరకరాల పొలం ఉన్నదని, గత 11 నెలల్లో అనేక సార్లు సింఘుకు వచ్చి నిరసనలో పాల్గొన్నట్లు చెప్పారు.
బాధిత రైతు కుటుంబానికి రూ.6 లక్షల అప్పు ఉన్నదని, ఆత్మహత్య చేసుకున్న రైతుకు ఒక కుమారుడితోపాటు 21, 19 ఏండ్ల వయసున్న ఇద్దరు కూతుర్లు ఉన్నట్లు నిర్మల్ సింగ్ చెప్పారు. ఆ రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు చెల్లించాలని, పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.