UP | వాళ్లంతా పవర్ ప్లాంట్లలో పనిచేసే కార్మికుల బిడ్డలు. పేద కుటుంబాలకు చెందినవారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలనుకొన్న వారి కలలు రాత్రికి రాత్రి కల్లలయ్యాయి. పవర్ ప్లాంట్ పరిధిలోని స్కూల్స్ను ప్రైవేట్కు అప్పగిస్తూ బీజేపీ పాలిత యూపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయమే దీనికి కారణం.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లోని యూపీ రాజ్య విద్యుత్తు ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ (యూపీఆర్వీయూఎన్ఎల్) అధికారులు తీసుకొన్న తాజా నిర్ణయం థర్మల్ పవర్ ప్లాంట్ కార్మికుల పిల్లల జీవితాలను అగమ్యగోచరంగా మార్చివేసింది. ప్లాంట్ల పరిధిలోని పలు స్కూళ్ల నిర్వహణను ఢిల్లీకి చెందిన ప్రైవేటు సంస్థ డీఏవీ కాలేజీకి అప్పగిస్తూ యూపీఆర్వీయూఎన్ఎల్ ఇటీవల నిర్ణయించింది. పదేండ్లపాటు ఈ లీజు కొనసాగనున్నది.దీంతో ఓబ్రా, అన్పారా, పరిచ్చా, పంకీ, హర్దుగంజ్ థర్మల్ పవర్ ప్లాంట్ల పరిధిలో ఏర్పాటు చేసిన పలు స్కూళ్లలోని దాదాపు 1,700 మంది విద్యార్థులు నిరసనబాట పట్టారు. యూపీఆర్వీయూఎన్ఎల్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోన్భద్ర పట్టణంలోని రోడ్లమీద ర్యాలీలు నిర్వహించారు. పవర్ కార్పొరేషన్ ఏకపక్ష నిర్ణయంపై చూసీచూడనట్టు వ్యవహరిస్తున్న యోగి సర్కారుపై నిప్పులు చెరిగారు.
చౌకగా లీజు రుసుము
లీజులో భాగంగా పవర్ కార్పొరేషన్కు డీఏవీ కాలేజీ ఏటా రూ.36 వేలు చెల్లించనున్నట్టు ఒప్పందంలో ఉన్నది. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.లక్షల విలువైన ఈ లీజు ఇంత కారుచౌకగా కట్టబెట్టడంపై పలువురు మండిపడుతున్నారు. పాఠశాలలను ప్రైవేటుకు అప్పగిస్తే, టీచింగ్ స్టాఫ్ ఎంపికలో ప్రమాణాలకు మంగళం పాడే ప్రమాదం ఉన్నదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం విద్యార్థులకు నెల ఫీజును రూ.25గా వసూలు చేస్తుండగా, వచ్చే నెల నుంచి ఫీజు మొత్తాన్ని ఏకంగా రూ.2 వేలకు పెంచనున్నట్టు ఇప్పటికే సర్క్యులర్ జారీ అయినట్టు పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలు, పేద కార్మికుల పిల్లలు ఈ స్కూళ్లలో చదువుకొంటున్నారని, ఇప్పుడు ఫీజుల పెంపుతో వారిని చదువుకు దూరం చేయవద్దని ఆలిండియా పీపుల్స్ ఫ్రంట్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆమరణ నిరాహార దీక్ష
ఇది కేవలం ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసన కాదు. 1,700 మంది విద్యార్థులకు సంబంధించిన అంశం. ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే, ఆమరణ నిరాహార దీక్షకు దిగుతాం.
-ఆకాశ్ యాదవ్, ఓబ్రా ప్లాంట్ స్కూల్ విద్యార్థి