బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం పతాకస్ధాయికి చేరింది. పోలింగ్ తేదీ దగ్గరపడుతుండటంతో ప్రధాన పార్టీల అగ్రనేతలు ర్యాలీలు, రోడ్షోలు, భారీ బహిరంగసభలతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) బీజేపీ లక్ష్యంగా మంగళవారం పలు ప్రచార సభల్లో విమర్శలు గుప్పించారు. ప్రజల సమస్యలు, అంశాల ప్రాతిపదకన ఏ ఒక్క రాష్ట్రంలోనైనా పోటీ చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలకు ప్రియాంక సవాల్ విసిరారు. మాండ్యలో జరిగిన రోడ్షోలో ఆమె మాట్లాడుతూ గతం ఊసెత్తకుండా, ప్రజా సమస్యలే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేయాలని కాషాయ నేతలను కోరారు.
మూడున్నరేండ్లుగా కర్నాటకలో కమలనాధులు ప్రభుత్వాన్ని నడుపుతున్నారని, కానీ వారెన్నడూ తమ ముఖాలను మీకు చూపలేదని, కనీసం మీ ఎదుట నిలుచుని మాట్లాడే సత్తా వారికి లేదని దుయ్యబట్టారు. ఈసారి కర్నాటకలో ప్రజలు మార్పు కోరుతున్నారని, బీజేపీ ఓటమిపాలై కాంగ్రెస్ సర్కార్ కొలువుతీరుతుందని ప్రియాంక గాంధీ ధీమా వ్యక్తం చేశారు. కాగా, తిర్ధహళ్లిలో మంగళవారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ మూడేండ్ల కిందట దొడ్డిదారిన బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని దుయ్యబట్టారు.
కాషాయ సర్కార్ అధికారాన్ని బలవంతంగా గుంజుకుందని ఆరోపించారు. బీజేపీ సర్కార్ అవినీతిపై ప్రధాని మోదీ ఎందుకు మాట్లాడటం లేదని రాహుల్ నిలదీశారు. కర్నాటకలో కాషాయ సర్కార్ అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏం చర్యలు తీసుకున్నారో మోదీ వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఇక్కడకు వచ్చి కాంగ్రెస్ తనపై 91 సార్లు దాడి చేసిందని చెబుతున్నారు తప్ప కర్నాటక గురించి ఏమీ మాట్లాడటం లేదని అన్నారు.ఇక కర్నాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.
Read More
Ukraine | ‘కాళీమాత’ ఫొటోతో వివాదాస్పద ట్వీట్.. క్షమాపణలు చెప్పిన ఉక్రెయిన్