Ukraine | హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ‘కాళీ మాత’ (Kali Mata) ఫొటోతో ఉక్రెయిన్ (Ukraine) ఇటీవల ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై భారతీయులు (Indians) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది దీనిని హిందువుల మనోభావాలపై ఉక్రెయిన్ దాడి అంటూ పేర్కొన్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ సలహాదారు కంచన్ గుప్తా (Kanchan Gupta) కూడా ఉక్రెయిన్ తీరుపై మండిపడ్డారు. ఈ చిత్రాన్ని హిందువుల మనోభావాలపై దాడిగా అభివర్ణించారు. ఈ ఫొటోపై ఉక్రెయిన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
దీంతో దిగొచ్చిన ఉక్రెయిన్.. మంగళవారం క్షమాపణలు చెప్పింది. ‘కాళీమాత’ (Kali Mata) ఫొటోతో అభ్యంతరకర ట్వీట్ చేసినందుకు గానూ ఆ దేశ డిప్యూటీ విదేశాంగ మంత్రి (Ukraine Deputy Foreign Minister ) ఎమిన్ ఝపరోవా (Emin Zhaparova) విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ‘కాళీ దేవతను వక్రీకరిస్తూ చిత్రీకరించినందుకు ఉక్రెయిన్ పశ్చాత్తాపపడుతోంది. ఉక్రెయిన్ భారతీయ సంస్కృతిని గౌరవిస్తుంది. భారత్ సహాయాన్ని మేము అభినందిస్తున్నాము’ అని ఎమిన్ పేర్కొన్నారు.
We regret @DefenceU depicting #Hindu goddess #Kali in distorted manner. #Ukraine &its people respect unique #Indian culture&highly appreciate🇮🇳support.The depiction has already been removed.🇺🇦is determined to further increase cooperation in spirit of mutual respect&💪friendship.
— Emine Dzheppar (@EmineDzheppar) May 1, 2023
రష్యా (russia)లో చమురు డిపోపై దాడి చేసిన తర్వాత వెలువడిన పొగపై కాళీ మాతను తలిపించేలా హాలీవుడ్ నటి మార్లిన్ మన్రో (Marilyn Monroe)ను గుర్తు తెచ్చేలా ఓ ఫోటోను ట్వీట్ చేసింది. ‘వర్క్ ఆఫ్ ఆర్ట్’ (Work of Art) అనే క్యాప్షన్తో స్కర్టు ధరించిన స్త్రీ బొమ్మను ట్వీట్ చేసింది. కాళీ మాతను పోలినట్లు ఉన్న ఈ ఫొటోను చిత్రీకరించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు, భారతీయులు ఉక్రెయిన్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ‘హిందూ ఫోబియా’ అంటూ పలువురు భారతీయులు ఉక్రెయిన్ను నిందించారు. హిందువుల పవిత్ర దైవం అయిన కాళీ మాతను ఎగతాళి చేస్తున్నారంటూ మండిపడ్డారు.
ఈ అభ్యంతరకరమైన ట్వీట్ చేసినందుకు గానూ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. మరికొందరు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రి జైశంకర్ను ట్యాగ్ చేస్తూ.. ఈ వివాదంలో జోక్యం చేసుకోవాలని కోరారు. మరికొంత మంది భారత్.. రష్యాకు మద్దతుగా నిలవడం వల్లే ఉక్రెయిన్ ఇలా చేస్తోంది అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో దిగొచ్చిన ఉక్రెయిన్.. తాజాగా క్షమాపణలు చెప్పింది.