లక్నో : యూపీలో మూడు దశాబ్ధాల పాటు కాంగ్రెసేతర పార్టీల పాలనలో అభివృద్ధి శూన్యమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. యూపీలో ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధి గురంచి మాటలు చెప్పడం మినహా చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో వీధి పశువులు పంటలను నాశనం చేస్తుంటే ఆ విషయం ప్రధానికి తెలియకపోవడం విడ్డూరమని నరేంద్ర మోదీపై చురకలు వేశారు. యూపీలో కేవలం బీజేపీ కోట్లు గుమ్మరించి ఇస్తున్న ప్రకటనల్లోనే అభివృద్ధి కనిపిస్తోందని ప్రియాంక గాంధీ ఆరోపించారు. సీఎం, పీఎం కాషాయ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా యూపీలో అభివృద్ధి జరగలేదని ఆమె మండిపడ్డారు. గత 30 ఏండ్లుగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు కులం, మతంపై రాజకీయాలు చేయడంతోనే రాష్ట్రంలో ఈ దుస్ధితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక శనివారం పనియారలో జరిగిన సభలో మాట్లాడుతూ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతూ బీఎస్పీ, ఎస్పీ, బీజేపీలు ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయని అన్నారు.ఓటర్లు కూడా ఆయా పార్టీలు ఎలాంటి పనులు చేయకుండానే అధికారం చేపట్టేలా వ్యవహరించడంతో పార్టీలకు కులాలు, మతాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్నాయని పేర్కొన్నారు.మీ పిల్లలు నిరుద్యోగులుగా ఉన్నా మీరు భావోద్వేగాలకు లోబడి కండ్లు మూసుకుని ఓటు వేస్తున్నారని ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు ఇక్కడికి వచ్చి పాకిస్తాన్, ఉగ్రవాదం, మతం గురించి మాట్లాడతారు తప్ప మీ బాగోగుల గురించి ప్రస్తావించరని కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు.
ఇక ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకూ ఏడు దశల్లో యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు. యూపీ ఎన్నికల్లో గెలుపొంది తిరిగి పాలనా పగ్గాలు చేపట్టాలని పాలక బీజేపీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతుండగా యోగి సర్కార్పై వ్యతిరేకతను సొమ్ము చేసుకుని అందలం ఎక్కాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ సర్వశక్తులు ఒడ్డుతోంది. ప్రియాంక గాంధీ ఇమేజ్తో యూపీ ఎన్నికల్లో సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చెమటోడుస్తుండగా. దళితులు, అణగారిన వర్గాల వెన్నుదన్నుతో ప్రధాన పార్టీలకు దీటుగా బదులివ్వాలని మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ పావులు కదుపుతోంది.