లక్నో : యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆరోపించారు. లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్ అయిన నేపధ్యంలో ప్రియాంక గాంధీ ఈ ఆరోపణలు చేశారు. సచివాలయం, రోడ్డు లేదా మరే ప్రదేశంలోనైనా యూపీలో మహిళలు అభద్రతలో ఉన్నారని ప్రియాంక ఆందోళన వ్యక్తం చేశారు. మహిళల భద్రతపై యోగి సర్కార్ గొప్పగా చెబుతుంటే వాస్తవ పరిస్థితి ఇలా ఉందని ఆమె ఎద్దేవా చేశారు.
యూపీలో ఓ సోదరి తనకెదురైన లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేస్తే చర్యలు చేపట్టనందున ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ చేయాల్సి వచ్చిందని..ఇలా ఎంతకాలం పోరాడాలని ఆమె సహనాన్ని పరీక్షిస్తున్నారని లక్నో ఘటనను ప్రస్తావిస్తూ ప్రియాంక పేర్కొన్నారు. దేశ మహిళలంతా మీ వెంట ఉన్నారని బాధితురాలికి ఆమె భరోసా ఇచ్చారు. యూపీలో మహిళలకు భద్రత లేదని, శాంతి భద్రతల పరిస్ధితి దిగజారిందని కాంగ్రెస్ సహా విపక్షాలు యోగి సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు.