న్యూఢిల్లీ : అయోధ్య భూ కుంభకోణంపై ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా విచారణకు ఆదేశించిందని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె సర్వోన్నత న్యాయస్ధానానికి విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడుతున్నందున ఈ అంశాన్ని కోర్టు సుమోటోగా స్వీకరించాలని కోరారు.
మందిర నిర్మాణానికి ఉద్దేశించిన ట్రస్ట్ నుంచి కాషాయ నేతలు, అధికారులు సొమ్ము చేసుకుంటున్నారని ప్రియాంక ఆరోపించారు. పాలక బీజేపీ నేతలు నిధులను లూటీ చేస్తూ ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆలయం నిర్మిస్తున్నందున కోర్టు చేతనే దర్యాప్తు జరగాలని నేతలపై వచ్చిన ఆరోపణలను జిల్లా స్ధాయి అధికారులు విచారించలేరని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.
విక్రయ ఒప్పంద పత్రాలపై రామమందిర ట్రస్ట్ సభ్యుల సంతకాలున్నాయని ఆమె చెబుతూ నాయకులు, అధికారుల జేబులు నింపేందుకు ట్రస్ట్ సొమ్మును దోచిపెట్టారని ధ్వజమెత్తారు. 2017లో రూ 2 కోట్ల విలువైన భూమిని రూ 26.5 కోట్లకు ట్రస్ట్కు విక్రయించారని అన్నారు.