లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ తొలిసారిగా నవసంకల్ప్ శిబిరం పేరుతో మేధోమధన సదస్సు ఏర్పాటు చేసింది. రెండు రోజుల పాటు సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు యూపీ ఇన్చార్జ్, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బుధవారం లక్నో చేరుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమికి దారితీసిన పరిస్ధితులతో పాటు పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై సంప్రదింపులు జరుపుతారు. పార్టీ కార్యవర్గసభ్యులు, జిల్లా, నగర అధ్యక్షులు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు, అనుబంధ సంస్ధల రాష్ట్ర అధ్యక్షులు, పార్టీ ప్రతినిధులు పాల్గొననున్నారు.
యూపీలో పార్టీ ప్రక్షాళన దిశగా చేపట్టాల్సిన చర్యలపైనా ప్రియాంక గాంధీ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేయనున్నారు. పాలక బీజేపీ, విపక్ష ఎస్పీలకు దీటుగా ఎదిగేందుకు అవసరమైన కార్యాచరణపైనా ఈ సదస్సులో పార్టీ నేతలు చర్చిస్తారు.పార్టీ అభివృద్ధికి ఎలాంటి రోడ్మ్యాప్ అవసరమనేదానిపై నేతల నుంచి సలహాలు, సూచనలు ఆహ్వానిస్తారు.