సూర్యాపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య నడపనున్న బుల్లెట్ ట్రెయిన్ను మొదట ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐక్య పోరాటాలు చేసి సాధించుకుందామని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అర్థంపర్థం లేని అలైన్మెంట్ మార్పు వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదన్నారు. నేషనల్ హైవే 65కు సమాంతరంగా రైల్వే కారిడార్ సాధించేందుకు ఆదివారం సూర్యాపేట పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల, చౌటుప్పల్ నుంచి అఖిల పక్ష నేతలు, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగదీశ్రెడ్డి శనివారం సాయంత్రమే పట్టణానికి చేరుకున్నారు. అయితే ఇటీవల మృతి చెందిన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో వెళ్లాల్సి ఉండటంతో హుటాహుటిన ఆయన ఆదివారం ఉదయం బయలు దేరి వెళ్లారు. దీంతో జగదీశ్రెడ్డి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన నాయకులకు ఫోన్ ద్వారా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ప్రసంగించారు. బుల్లెట్ ట్రెయిన్ కోసం అందరం కలిసి కొట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీలకు అతీతంగా ఉద్యమం రూపొందించడం మంచి పరిణామమన్నారు. అలైన్మెంట్ మార్పు కారణంగా కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, నార్కట్పల్లి, చిట్యాల, చౌటుప్పల్ తదితర ప్రాంతాలకు నష్టం జరుగుతుందన్నారు.
నెలాఖరు వరకు ఉద్యమ కార్యాచరణ
సూర్యాపేట, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ) : జాతీయ రహదారికి సమాంతర రైల్వే కారిడార్ సాధన పోరాట కమిటీ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇకపై దీని రూపం మారి ఉద్యమ బాట పట్టనుంది. ఇందుకోసం సూర్యాపేటలో ఉమ్మడి ఉద్యమ కార్యాచరణను రూపొందించారు. ఈ మేరకు ఆదివారం సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సదస్సులో ఉద్యమ కార్యాచరణకు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన పెద్దిరెడ్డి రాజా, మల్లు నాగార్జున్రెడ్డి, ధర్మార్జున్, అనుములపురి రవిబాబు, డాక్టర్ రామ్మూర్తి, మండారి డేవిడ్కుమార్, బెజవాడ వెంకటేశ్వర్లు, కొత్తపల్లి శివ, చలమల్ల నర్సింహా, వివిధ సంఘాల నుంచి ఆరుట్ల జానకిరెడ్డి, రమణాచారి, బండారు రాజా, కర్నాటి కిషన్, మిట్టపల్లి రమేష్, యామా ప్రభాకర్, గండూరి శంకర్, ఉదయగిరి, అక్కినేపల్లి వీరస్వామి, సైదులు, పులి పాపయ్య, లింగయ్య, చిరంజీవి, గజ్జి రవి, రాంబాబు, భూపతి రాములు, ఉద్యోగ సంఘాలకు చెందిన దున్న శ్యాం, దామెర శ్రీను, ముప్పాని కృష్ణారెడ్డి, విద్యార్థి సంఘాలకు చెందిన అనంతుల మధు, ఆవుల నాగరాజు, సింహాద్రి, సునీల్ గంట నాగయ్య, మట్టిపల్లి సైదులు, గట్ల రమా శంకర్, బొమ్మగాని వినయ్ గౌడ్, సట్టు నాగయ్య, మాధవ్, వెలుగు వనిత, చంద్రకళ తదితరులు ఉన్నారు.