Priyanka Gandhi : ఇవాళ గుజరాత్లో లోక్సభ ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ వాద్రా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశ రాజ్యాంగాన్ని మార్చేస్తుందని ఆరోపించారు. మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగంలో కీలక మార్పులు చేస్తామని స్వయంగా బీజేపీ నేతలే మీడియాకు చెప్తున్నారని ఆమె గుర్తుచేశారు.
గుజరాత్లోని వల్సాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అనంత్ పటేల్కు మద్దతుగా శనివారం ప్రియాంకా గాంధీ ప్రచారం నిర్వహించారు. దేశంలో నెలకొన్న ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరల పెరుగుదలకు మోదీ పాలనా వైఫల్యమే కారణమని విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీని ‘మెహంగాయీ మ్యాన్’ అంటే బాగుంటుందని వ్యాఖ్యనించారు.
బీజేపీ నేతలు ప్రధాని మోదీ శక్తిమంతుడని పొగుడుతున్నారని, మోడీ చిటికె వేస్తే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందంటున్నారని, అలాంటప్పుడు ఆయన మన దేశ పేదరికాన్ని ఎందుకు తొలగించలేకపోతున్నారని ప్రియాంకాగాంధీ ప్రశ్నించారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఉండటం వల్లే ప్రధాని మోదీ సిలిండర్ల ధరలను తగ్గించారని, ఆయనకు ప్రజలపై సానుభూతి లేదని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ నగలు, మంగళసూత్రం దొంగిలించి వేరొకరికి ఇస్తారని కూడా మోడీ మామయ్య ఎప్పుడో ఒకప్పుడు చెప్పడం మొదలు పెట్టే అవకాశం ఉందని ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. దేశ ప్రధాని హోదాలో మోదీ పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తల్లులు, సోదరీమణుల బంగారం లెక్కిస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొందని రాజస్థాన్లో ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ప్రియాంక గాంధీ కౌంటర్ ఇచ్చారు.