PM Modi | నూతన పార్లమెంటు ప్రారంభం.. మోదీ పట్టాభిషేక కార్యక్రమంలా సాగిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి లేకుండానే ప్రజాస్వామ్య సౌధం ప్రారంభం కావడం గమనార్హం. కార్యక్రమం అంతటా ప్రధాని మాత్రమే కనిపించారు. రాజదండం ప్రతిష్ఠాపన రాజరిక తంతును తలపించిందని విపక్షాలు మండిపడ్డాయి.
న్యూఢిల్లీ, మే 28: పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవం అట్టహాసంగా, ఆర్భాటంగా జరిగింది. ఒకవిధంగా చెప్పాలంటే ప్రధాని మోదీకి పట్టాభిషేకమా! అన్నట్టు సాగింది. పూజలు, హోమం, రాజదండంతో లోక్సభలోకి రావటం.. ఇలా ప్రతి సందర్భంలో ప్రధాని మోదీయే కనిపించారు. రాష్ట్రపతితో పాటు రాజ్యసభ చైర్మన్ అయిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కార్యక్రమాల్లో కనిపించలేదు. ప్రధాని మోదీ సెంగోల్(రాజదండం)ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠించారు.
రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడంపై గిరిజనుల నిరసన
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించకపోవడాన్ని నిరసిస్తూ రాంచీలో కాంగ్రెస్, సీపీఐతో పాటు పలు గిరిజన సంఘాలు ఆదివారం నిరసన చేపట్టాయి. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేని కాంగ్రెస్, సీపీఐ నేతలు, గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పార్లమెంట్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఆప్, టీఎంసీ, డీఎంకే ఎన్సీపీ, ఆర్జేడీ, జేడీయూ, శివసేన(ఉద్ధవ్ వర్గం) సహా పలు ప్రధాన పార్టీలు దూరంగా ఉన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, తమిళనాడు సీఎం స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు.
దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారు: పవార్
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ కార్యక్రమాలు దేశాన్ని ప్రధాని మోదీ దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నట్టు కనిపిస్తున్నదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. దేశ మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శాస్త్రీయ దృక్పథంతో కూడిన ఆధునిక భారతదేశ నిర్మాణం గురించి ప్రయత్నిస్తే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఈ కార్యక్రమం జరిగిందని పేర్కొన్నారు.
దేశ గౌరవాన్ని పెంచే మన క్రీడాకారుల పట్ల ఇలా ప్రవర్తించడం దారుణం. అత్యంత గర్హనీయం
– కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్
ప్రజాస్వామ్యం అంటే సహనం. కానీ అసహనంతో నిరంకుశ శక్తులు విజృంభిస్తున్నాయి. అసమ్మతిని అణచివేస్తున్నారు. చాంపియన్లపై ఈ విధంగా ప్రవర్తించడం సిగ్గుచేటు
– మమత, బెంగాల్ సీఎం
రెజర్లను ఈడ్చేసి అరెస్ట్ చేయడం ఖండనీయం. మొదటి రోజే రాజదండం వంగిపోయిందని ఈ చర్య సూచిస్తున్నది.
– స్టాలిన్, తమిళనాడు సీఎం
రెజ్లర్ల పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు దారుణం. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం రోజున మన దేశానికి గర్వకారణమైన చాంపియన్ రెజ్లర్లపై ఇలాంటి క్రూరమైన, సిగ్గుచేటు అయిన తీరు బాధాకరం
-హేమంత్ సొరేన్, జార్ఖండ్ సీఎం
– రెజ్లర్లపై దాడి చేసేందుకు ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చిందా? దీనికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలి
– సుప్రియా సూలే, ఎన్సీపీ ఎంపీ