చమురు ధరలు తగ్గించడం మా చేతుల్లో లేదని.. అంతర్జాతీయ పరిస్థితుల వల్లే ధరలు పెరుగుతున్నాయని మొన్నటి వరకు బుకాయించిన మోదీ ప్రభుత్వం.. ఎన్నికలు వచ్చే సరికి.. తమ పార్టీకి ఓటేస్తే వాటి ధరలు తగ్గిస్తామని ఆశ చూపుతోంది. అయితే ఇలాంటి బూటకపు హామీలను ప్రజలు నమ్మరని నెటిజన్లు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
PM Modi | హైదరాబాద్, నవంబర్ 18 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): పెట్రోల్, డీజిల్ ధరల్ని విపరీతంగా పెంచేసి, సామాన్యుడి జేబును గుల్లచేసిన మోదీ సర్కార్, ప్రజల్ని ఇంకా మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. ‘మాకు ఓటేస్తే..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాం’ అంటూ ఓట్లను కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. శనివారం రాజస్థాన్లోని భరత్పూర్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, ‘బీజేపీకి ఓటేస్తే పెట్రోల్-డీజిల్ ధరలను సమీక్షిస్తాం’ అని ప్రకటించారు.
బీజేపీని గెలిపిస్తే ఇంధన ధరలను తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇవ్వటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఓట్ల కోసం ధరలు తగ్గిస్తారా? బీజేపీకి వేయకపోతే ధరలు తగ్గించరా?..అంటూ నెటిజన్లు మండిపడ్డారు. గత రెండేండ్లుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినా, భారత్లో ఇంధన ధరల్ని మోదీ సర్కార్ ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. ‘రాజస్థాన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లీటరుకు రూ.12 అధికంగా ముక్కు పిండి వసూలు చేస్తున్నది’ అని ప్రధాని మోదీ ఆరోపించటం చర్చనీయాంశమైంది.
గతంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా మన దేశంలో ధరలు తగ్గించక పోగా పొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాలు, అమెరికా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ, స్పెయిన్, యూకే, కెనడా లాంటిదేశాల్లో ఎక్కువ ధరలున్నాయంటూ పార్లమెంటులో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మతాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసినట్టుగా, పెట్రోల్-డీజిల్ ధరలపైనా మోదీ సర్కార్ పాలిట్రిక్స్కు తెరలేపిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరగటానికి ఇంధన ధరలే కారణమని, ఎన్నికల్లో గెలుపు కోసం దీని గురించి ప్రధాని మోదీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
పెట్రోల్- డీజిల్ ధర పెంపు ప్రభావం నిత్యావసర సరుకులపై కూడా పడుతుంది. రవాణాకు అయ్యే ఖర్చు కూడా ఉల్లి, పప్పులు, నూనె లాంటి నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు కారణమవుతుండటంతో మోదీ పాలనలో సామాన్యుడికి పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. మధ్య తరగతి వారి కష్టాలు ప్రభుత్వం పట్టించుకోదు. ఎన్నికల్లో అధికారాన్ని నిలుపుకోవడానికో, లేదా అధికారంలోకి రావడానికి ఇలా కేంద్రంలోని బీజేపీ నాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ..ప్రజలను మభ్య పెట్టేందుకు పలు హామీలు ఇచ్చే బదులు, గత తొమ్మదిన్నరేండ్ల నుంచి సామాన్యులకు మేలు చేసే చర్యలు తీసుకోకుండా ఎన్నికల ముందు హామీలిస్తే ప్రజలు నమ్మరని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. బడాబాబులకు కొమ్ము కాస్తూ..అదానీ లాంటి వారికి ్ల ప్రజాధనం దోచిపెడుతున్నారని సోషల్ మీడియాలో నిరసనలు వెల్లు వెత్తుతున్నాయి.