జైపూర్: ప్రధాని నరేంద్రమోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీపై రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లు ఐదోండ్లకు ఒక్కసారి ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్ల కోసం వస్తారని, ఎన్నికలు అయిపోగానే కంటికి కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు. ఇవాళ రాజస్థాన్లోని శ్రీగంగానగర్ జిల్లాలో జరిగిన ఓ బహిరంగ సభలో సచిన్ పైలట్ ప్రసంగిస్తూ మోదీ, ఒవైసీలపై విమర్శలు గుప్పించారు.
ఈ ఏడాది అఖరులో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయని, అందుకే ప్రధాని మోదీ దౌసాలో, అసదుద్దీన్ ఒవైసీ టోంక్లో హడావిడి చేస్తున్నారని పైలట్ అవహేళన చేశారు. కాంగ్రెస్ కంచుకోటలా ఉన్న ఏరియాల్లో పర్యటించి బీజేపీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో.. ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్ వేలో భాగమైన ఢిల్లీ-దౌసా-లాల్సత్ మార్గం ప్రారంభోత్సవాన్ని ప్రధాని వాడుకున్నారని ఆరోపించారు. ఎన్నికలు దగ్గరపడగానే రాజస్థాన్లో హడావిడి చేస్తున్న మోదీ, ఒవైసీ గత నాలుగేండ్లుగా ఎక్కడున్నారని ప్రశ్నించారు.