న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల మంట ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. గత వారం రోజులుగా చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో ధరలను పెంచుతూనే ఉన్నాయి. తాజాగా లీటరు పెట్రోల్పై 30 పైసలు, డీజిల్పై 35 పైసలు వడ్డించాయి. దీంతో దేశ రాజధానిలో చమురు ధరలు ఆల్టైం హైకి చేరాయి. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.104.44కు చేరగా, డీజిల్ రూ.93.17కు పెరిగింది. ఆర్థిక రాజధానిలో ధరలు చుక్కలనంటాయి. ముంబైలో పెట్రోల్ రూ.110.41, డీజిల్ రూ.101.03కు చేరాయి.
ఇక హైదరాబాద్లో లీటరు పెట్రోల్ 31 పైసలు, డీజిల్ 38 పైసల చొప్పున పెరగడంతో పెట్రోల్ ధర రూ.108.64కు చేరగా, డీజిల్ ధర రూ.101.65కు చేరింది. విజయవాడలో పెట్రోల్ రూ.110.39, డీజిల్ రూ.102.74గా ఉన్నది.