(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): పెట్రో పెంపు నిర్ణయంతో రవాణా వ్యయం పెరిగి అంతిమంగా దాని ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలపై పడుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా రానున్న రోజుల్లో కూరగాయలు, పండ్లు, పాల ఉత్పత్తులు, ప్యాకెజ్డ్ ఫుడ్, వంట నూనెల ధరలు మరింతగా పెరుగొచ్చని అంచనా వేస్తున్నారు. క్యాబ్, ఆటో సర్వీసుల రేట్లు పెరుగడంతో పాటు పర్యాటక సేవల రుసుము కూడా భారీగా పెరిగే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. మొత్తంగా సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
పెట్రోవాతతో పెట్టుబడి వ్యయం పెరిగి రైతులకు వ్యవసాయం కూడా భారంగా మారొచ్చని నిపుణులు చెప్తున్నారు. దుక్కిదున్నడానికి ట్రాక్టర్లు, వ్యవసాయ పంపులు, ఎరువుల రవాణా, ధాన్యం తరలించడానికి ఇంధనం ఎంతో కీలకమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగడంతో రైతులపై ఇది అదనపు భారమేనని అంటున్నారు.