న్యూఢిల్లీ, జనవరి 25: పాశ్చాత్య దేశాలతో పోల్చితే భారత ప్రజాస్వామ్యం ఎంతో పురాతనమైందని రాష్ట్రపతి ద్రౌపది ముర్మ అన్నారు. అందుకే భారత్ను ప్రజాస్వామ్యానికి తల్లి అని అంటారని పేర్కొన్నారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం రాష్ట్రపతి జాతినుద్దేశించి ప్రసంగించారు. గొప్ప మందిరంగా అయోధ్య రామాలయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రజల విశ్వాసాలే కాకుండా, న్యాయ ప్రక్రియపై ఎనలేని నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలు, హింస చెలరేగటంపై రాష్ట్రతి ఆందోళన వ్యక్తం చేశారు. భయాలు, పక్షపాతాలు.. భరించలేని స్థాయిలో హింసకు దారితీశాయన్నారు. వర్ధమాన మహావీరుడు, మహాత్మాగాంధీ, అశోకుడి బోధనలు ఉటంకించిన రాష్ట్రపతి.. త్వరలోనే శాంతియుత పరిస్థితులు నెలకొంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లుతో ప్రభుత్వ పాలన మరింత మెరుగుపడుతుందని, మహిళా సాధికారతలో విప్లవాత్మక మార్పుకు నాంది అవుతుందని రాష్ట్రపతి అన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయటంలో మహిళా అథ్లెట్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని ముర్ము అన్నారు.
ఆసియా క్రీడల్లో భారత్ 107 మెడల్స్ సాధించగా, అందులో మహిళా అథ్లెట్స్ 46 పథకాలు అందుకున్నారని ప్రశంసించారు. కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ సాంకేతిక పురోగతి దైనందిన జీవితాల్లో భాగమవుతున్నాయని చెప్పారు. వీటిలో ఆందోళన కలిగించే అం శాలు ఉన్నా.. యువతకు అనేక కొత్త అవకాశాలు సృష్టిస్తున్నాయని ముర్ము చెప్పారు.