Madhya Pradesh | భోపాల్, ఫిబ్రవరి 17: మధ్యప్రదేశ్లోని మొరానా జిల్లాలో శుక్రవారం దారుణం జరిగింది. ఓ గర్భిణి(34)పై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు దవాఖానలో చికిత్స పొందుతున్నది. చావు బతుకుల మధ్య పోరాడుతున్నది.
పోలీసుల కథనం ప్రకారం బాధితురాలి భర్త లైంగిక దాడి నేరంపై జైలు కెళ్లి ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చాడు. తన భర్తపై లైంగిక దాడి కేసు పెట్టిన మహిళతో రాజీ చేయించటానికి బాధితురాలు యత్నించింది. ఇందులో భాగంగా కేసు పెట్టిన మహిళ గ్రామానికి వెళ్లింది. అక్కడ ఆమె ఇంట్లోని ముగ్గురు వ్యక్తులు బాధితురాలిపై సామూహికంగా లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెపై కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. మెజిస్ట్రేట్ సమక్షంలో ఆమె వాంగ్మూలం రికార్డు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.