వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పునరుత్థానం జరగాలన్నది సోనియా ప్రగాఢ ఆకాంక్ష. ఇందులో భాగంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో పలు మార్లు భేటీ అయ్యారు. ఆయన నుంచి సలహాలు స్వీకరించారు. పీకే కూడా కాంగ్రెస్ పునరుత్థాన ప్రణాళికను రూపొందించారు. దాదాపు 80 పేజీలతో కూడిన ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను అధిష్ఠానానికి సమర్పించారు.
అయితే.. అందులో ప్రధానమైనది… అధ్యక్ష బాధ్యతల నుంచి త్రిమూర్తులూ తప్పుకోవాలన్నది పీకే పెట్టిన శరతు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ ఎవ్వరు కూడా పార్టీ అధ్యక్ష బాధ్యతల్లో వుండకూడదని పీకే తన ప్రణాళికలో స్పష్టంగా పేర్కొన్నారు. వీరు కాకుండా.. బయటి నేతలకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని పీకే సూచించారు.
అయితే… కేవలం వీరిని తప్పుకోమనడమే కాకుండా.. వీరు ఏఏ బాధ్యతలు నిర్వర్తించాలో కూడా పీకే తన ప్రణాళికలో స్పష్టంగా సూచించినట్లు ఢిల్లీ వర్గాలు పేర్కొంటున్నాయి. సోనియా గాంధీ యూపీఏ చైర్మన్ బాధ్యతల్లో వుండాలని, రాహుల్ గాంధీ పార్లమెంట్ బోర్డు అధ్యక్షుడిగా, ప్రియాంక ప్రధాన కార్యదర్శులకు సమన్వయ కర్తగా వుంటే… పార్టీ బాగుంటుందని సూచించారు.
అలాగే తూర్పు, దక్షిణాది సీట్లపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని, ఈ ప్రాంతాల్లో బీజేపీ బలహీనంగా ఉందని పీకే పేర్కొన్నారు. అలాగే సైద్ధాంతిక మూలాలను సమూలంగా మార్చుకొని, వంశపారంపర్య పద్ధతుల్లో కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీని నడపాలని తన నివేదికలో పేర్కొన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు, అవినీతి రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని ప్రజలకు సంకేతాలిస్తే బాగుంటుందని పీకే సూచించారు.