Priyanka Gandhi- Kejriwal | ప్రధాని నరేంద్రమోదీపై ధృవీకరించని, తప్పుడు ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకాగాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆమ్ఆద్మీ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్ వేదికగా ప్రధాని మోదీపై అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇదే తరహా నోటీసు జారీ చేసింది.
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీపై ప్రియాంకాగాంధీ ధృవీకరించని, తప్పుడు ఆరోపణలు చేశారని కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై గురువారం రాత్రి ఎనిమిది గంటల్లోపు వివరణ ఇవ్వాలని ప్రియాంకను ఈసీ ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రైవేట్ చేశారని నిరాధార, తప్పుడు ఆరోపణలు చేశారని ప్రియాంకపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది.
ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని ఆప్ సోషల్ మీడియా వేదికగా వీడియో క్లిప్పింగ్స్ పోస్ట్ చేయడం అనైతికం, ఆమోద యోగ్యం కాదని బీజేపీ ఈ నెల 10 కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఈసీ.. ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంపీసీ) ఉల్లంఘనపై గురువారం లోగా వివరణ ఇవ్వాలని ఆప్ పార్టీని కోరింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ సారధ్యంలోని బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన వారిలో ఉన్నారు.