న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. ఈ క్రమంలో ఇవాళ సాయంత్రం 6:30 గంటలకు రాష్ర్టాల సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధిపతులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియపై చర్చించనున్నారు. కరోనా మహమ్మారి నివారణకు తీసుకోవాల్సిన చర్యలను సీఎంలకు మోదీ సూచించనున్నారు.
మహారాష్ర్టలో కేసుల తీవ్రతపై ప్రత్యేకంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలు నగరాల్లో నైట్ కర్ఫ్యూ అమలవుతున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలనే నిబంధనను కఠినంగా అమలు చేయాలని రాష్ర్టాలకు మోదీ సూచించనున్నారు. దీనిపై ప్రత్యేక అవగాహన కోసం రేపట్నుంచి ఈ నెల 14వ తేదీ వరకు పలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణపై ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో ఇటీవలే సమీక్షా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ సమావేశానికి క్యాబినెట్ సెక్రెటరీతో సహా పలువురు సీనియర్ అధికారులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి, ఆరోగ్యశాఖ కార్యదర్శి డాక్టర్ వినోద్ పాల్ హాజరయ్యారు.
ఇవి కూడా చదవండి..