Narendra Modi | న్యూఢిల్లీ, మార్చి 16: పాకిస్థాన్తో శాంతిని నెలకొల్పడానికి భారత్ ప్రయత్నం చేసినప్పుడల్లా శత్రుత్వం, ద్రోహమే ఎదురైందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్తో జరిగిన పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య శాంతి నెలకొనాలన్న ఆశతోనే తొలిసారిగా 2014లో తన ప్రమాణ స్వీకారోత్సవానికి అప్పటి ప్రధాని నవాజ్ షరీఫ్ను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు. ఆ దేశంలో జరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు, అశాంతి పరిస్థితులకు ఎంతోమంది అమాయకులు సమిధలవుతున్నారన్నారు.
వాటితో ఆ దేశ ప్రజలు కూడా విసుగు చెందారన్నారు. శాంతి, సామరస్యాలే తమ విదేశాంగ విధానమని ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలలో భారత్ తన వైఖరి స్పష్టం చేసిందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకునే బాధ్యత పాక్పైనే ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు, తనకు మధ్య పరస్పర విశ్వాసం ఉందని, అన్నింటికంటే జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తాము భావిస్తామని, అదే తమను బాగా కనెక్ట్ చేసిందని చెప్పారు.
2002లో గుజరాత్లో గోద్రా అల్లర్ల అనంతరం అప్పట్లో కేంద్రంలో ఉన్న ప్రత్యర్థి పార్టీలు తప్పుడు కథనాల ద్వారా తనను శిక్షించాలని ప్రయత్నించాయని, కానీ కోర్టులు తనకు విముక్తి కల్పించాయని అన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి జీవిత విలువలు నేర్చకోవడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. ఇంత పవిత్రమైన సంస్థలో తానూ భాగస్వామి అయినందుకు అదృష్టవంతుడినని అన్నారు. ఇప్పుడు ప్రపంచంలో విస్తృతంగా ప్రచారం పొందుతున్న కృత్రిమ మేధ సాంకేతికత గురించి ప్రధాని మోదీ ప్రస్తావిస్తూ ఇది చాలా శక్తివంతమైనదని అన్నారు. అయితే అది మానవ మేధస్సు ఊహల లోతుకు ఎప్పటికీ సరిపోలకపోవచ్చునని అన్నారు
ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ సంక్షోభానికి యుద్ధం ద్వారా ఎన్నడూ పరిష్కారం లభించదని, ఇరు వర్గాలు చర్చలకు కూర్చున్నప్పుడు అది సమసిపోతుందని అన్నారు. తనకు రెండు దేశాల అధ్యక్షులతో మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. చైనా దేశంతో మనకు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ చర్చలకే తాను ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. ఇరు దేశాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నానని ప్రధాన మోదీ ఆకాంక్షించారు.