Lok Sabha Elections | న్యూఢిల్లీ, మార్చి 25: లోక్సభ ఎన్నికల సంగ్రామం ఊపందుకున్నది. ఈసారి ఎన్డీయే కూటమికి 400 సీట్లు అనే నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగగా, మోదీ సర్కారును గద్దెదింపడమే లక్ష్యంగా ప్రతిపక్ష ఇండియా కూటమి వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలో ప్రముఖులు పోటీచేస్తున్న స్థానాలపై అందరి దృష్టి నెలకొన్నది.
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ అభ్యర్థిగా వరుసగా మూడోసారి కూడా ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఆయనపై యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్రాయ్ మరోసారి పొటీచేస్తున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లోనూ మోదీని సవాల్ చేసిన అజయ్ రాయ్.. కేవలం మూడోస్థానానికి పరిమితం అయ్యారు. 2019లో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థి శాలిని యాదవ్పై నాలుగు లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మోదీ విజయం సాధించారు.
విపక్ష ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, పశ్చిమబెంగాల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొనేందుకు టీఎంసీ నిరాసక్తత వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని బహరమ్పూర్ స్థానం కాంగ్రెస్ లోక్సభా పక్ష నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్నది. ఇక్కడ 1999 నుంచి వరుసగా ఆయనే ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. అయితే ఈసారి టీఎంసీ ఆయనపై ప్రముఖ మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ను బరిలోకి దింపింది. క్రికెటర్గా యూసుఫ్కు ఉన్న క్రేజ్ ఎన్నికల్లో పనిచేస్తుందనే భావనలో మమత పార్టీ ఉన్నది.
కేరళలోని తిరువనంతపురం నుంచి మూడుసార్లు గెలుపొందిన కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ను ఓడించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది. ఆయనకు పోటీగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను బరిలోకి దింపింది. శశిథరూర్ రాజకీయాల్లో ప్రవేశించిన 2009 నుంచి తిరువనంతపురానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
పశ్చిమబెంగాల్లోని తామ్లుక్ నియోజకవర్గంలో పోరు ఆసక్తికరంగా ఉన్నది. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా ఇటీవల కలకత్తా హైకోర్టు జడ్జిగా రాజీనామా చేసిన అభిజిత్ గంగోపాధ్యాయ్ పోటీచేస్తున్నారు. ఆయనకు పోటీగా తృణమూల్ సోషల్ మీడియా హెడ్ దేబాంగ్షు భట్టాచార్యను పోటీచేస్తున్నారు. జడ్జి పోస్టుకు రాజీనామా చేసి బీజేపీలో చేరిన అభిజిత్పై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేశాయి. అభిజిత్ను ‘హైకోర్టు ధర్మాసనంలో కూర్చొన్న బీజేపీ బాబు’గా సీఎం మమతా బెనర్జీ ఓ సందర్భంగా అభివర్ణించారు.
అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో నియోజకవర్గం కేరళలోని వయనాడ్. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి పోటీచేస్తున్నారు. వయనాడ్లో ఈ సారి రాహుల్ను ఓడించే లక్ష్యంతో బీజేపీ తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్కు బరిలో నిలిపింది. ఈయన 2019 ఎన్నికల్లో అలప్పుజ నుంచి పోటీచేశారు. కాగా, గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ వయనాడ్తోపాటుగా యూపీలోని అమేథీ నుంచి పొటీచేయగా.. అక్కడ స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు.