న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంలతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య కూడా ఇందులో పాల్గొన్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై సీఎంలతో ప్రధాని చర్చించారు. జిల్లా స్థాయిలో తగిన ఆరోగ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, 15-18 ఏండ్ల పిల్లలకు టీకా డ్రైవ్ను వేగవంతం చేయాలని సూచించారు.
కాగా, ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ఈ ఏడాది నిర్వహిస్తున్న తొలి సమావేశం ఇదే. అశోక్ గెహ్లాట్ (రాజస్థాన్), హిమంత బిస్వా శర్మ (అస్సాం), చరణ్జిత్ చన్నీ (పంజాబ్), వి నారాయణ స్వామి (పుదుచ్చేరి), భూపేష్ బఘేల్ (ఛత్తీస్గఢ్), బిప్లబ్ దేబ్ (త్రిపుర), బసవరాజ్ బొమ్మై (కర్ణాటక), జోరంతంగ (మిజోరం) తదితర ముఖ్యమంత్రులు వర్చువల్ భేటీలో పాల్గొన్నారు.
దేశంలో కరోనా కేసుల రోజువారీ నమోదు రెండు లక్షలు దాటిన నేపథ్యంలో సీఎంలతో ప్రధాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకున్నది. మరోవైపు సీఎంల సమావేశానికి ముందు ప్రధాని మోదీ, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో ఇంట్రాక్ట్ అయ్యారు. కరోనా టెస్టింగ్, జీనోమ్ సీక్వెసింగ్తోపాటు వ్యాక్సినేషన్ డ్రైవ్ను వేగవంతం చేయాలని సూచించారు.