PM Modi | గుజరాత్లో కొత్తగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ ఆఫీస్ హబ్ అయిన సూరత్ డైమండ్ బోర్స్ (Surat Diamond Bourse) భవనాన్ని ప్రధాని మోదీ (PM Modi) ఆదివారం ప్రారంభించనున్నారు. సూరత్లోని డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ (డ్రీమ్) సిటీలో నిర్మించిన ఈ బిల్డింగ్ ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. దాదాపు రూ.3,500 కోట్ల వ్యయంతో 35.54 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ మెగాస్ట్రక్చర్లో 9 గ్రౌండ్ టవర్లతోపాటు 15 అంతస్తులు ఉన్నాయి. 300 చదరపు అడుగుల నుంచి 1 లక్ష చదరపు అడుగుల వరకు కార్యాలయ స్థలాలు ఉన్నాయి. 67 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భవన సముదాయంలో 4,500 డైమండ్ ట్రేడింగ్ కార్యాలయాలు ఉన్నాయి. ఇప్పటికే 130 కార్యాలయాలు వాడుకలో ఉన్నాయి. పెంటగాన్ కంటే పెద్దదని చెబుతున్న ఈ భవనానికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) నుంచి ప్లాటినం ర్యాంకింగ్ ఉంది. ఇప్పుడిది వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది.
డైమండ్ బోర్స్ క్యాంపస్లో పలు కార్యాలయాలతోపాటు సేఫ్ డిపాజిట్ వాల్ట్లు, కాన్ఫరెన్స్ హాల్స్, మల్టీపర్పస్ హాల్స్, రెస్టారెంట్స్, బ్యాంకులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్, కన్వెన్షన్ సెంటర్, ఎగ్జిబిషన్ సెంటర్లు, ట్రైనింగ్ సెంటర్లు, ఎంటర్టైన్మెంట్, రెస్టారెంట్స్, సెక్యూరిటీతో పాటు క్లబ్ వంటి సౌకర్యాలు ఉన్నాయి.
కాగా, సూరత్ డైమండ్ బోర్స్ ప్రారంభంతో వజ్రాల వ్యాపారాన్ని గుజరాత్కు తరలించుకుపోతున్నారని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ విమర్శించారు. అధికారంలో ఉన్నవారు దేశం గురించి ఆలోచించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా కుర్లా కేంద్రంగా నడుస్తున్న వజ్రాల వ్యాపారం.. డైమండ్ బోర్స్తో గుజరాత్కు మారుతుందని చెప్పారు. ఈ మార్కెట్పై ఆధారపడి లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఇప్పుడది సూరత్కు మారినట్లయితే స్థానికులు ఉద్యోగాలు కోల్పోతారని ఆవేదన వ్యక్తంచేశారు.