PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నవంబర్ 16 నుంచి 21 వరకూ రెండు ఖండాల్లోని మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు. ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్, గయానా దేశాలను సందర్శించనున్నారు.
మోదీ ముందుగా నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఈనెల 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని సమీక్షించడంతోపాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించనున్నారు. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది.
నైజీరియా పర్యటనను ముగించుకొని ప్రధాని బ్రెజిల్ (Brazil) పర్యటనకు వెళ్లనున్నారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్లోని రియోడిజనీరో నగరంలో జరగనున్న జీ-20 సదస్సులో (G20 Summit) ప్రధాని మోదీ పాల్గొంటారు. గతేడాది జీ-20 సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆ సదస్సుకు బ్రెజిల్ వేదికైంది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిస్ ఇనాసియో లులా డా సిల్వా ఆధ్వర్యంలో నిర్వహించే G20 సమ్మిట్లో ప్రధాని పాల్గొంటారు. ఈ సమ్మిట్లో పలువురు ప్రపంచ నేతలతో ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
బ్రెజిల్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ గయానాకు (Guyana) వెళ్లనున్నారు. గయానీస్ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీ ఆహ్వానం మేరకు గయానాలో పర్యటించనున్నారు. 56 ఏళ్ల తర్వాత (1968 తర్వాత) భారత ప్రధాని ఒకరు గయానాలో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో గయానా అధ్యక్షుడు మొహమ్మద్ అలీతో మోదీ చర్చలు జరపనున్నారు. ఇతర సీనియర్ నాయకులతోనూ సమావేశంకానున్నారు. గయానా పార్లమెంట్లోనూ ప్రసంగించనున్నారు. అదేవిధంగా భారతీయ ప్రవాసుల సమావేశంలోనూ మోదీ ప్రసంగిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక్కడ జరిగే రెండవ CARICOM-ఇండియా సమ్మిట్లో కూడా మోదీ పాల్గొంటారని తెలిపింది. CARICOM సభ్యదేశాల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తారు.
Also Read..
Devendra Fadnavis | ఫడ్నవీస్ బ్యాగ్ను కూడా చెక్ చేశారు.. వీడియోతో ఉద్ధవ్ ఠాక్రేకు బీజేపీ కౌంటర్
Laapataa Ladies | ఆస్కార్ కోసం పేరు మార్చుకున్న లాపతా లేడీస్..!
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. జీరోకు పడిపోయిన విజిబిలిటీ