యూపీ ఎన్నికల ప్రచార వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ రష్యా- ఉక్రెయిన్ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం యూపీలోని బహరాయిచ్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ… భారత్ మరింత బలమైన దేశంగా మారాల్సిన అవసరం ఉందన్నారు. అటు దేశ నాయకత్వం, ఇటు రాష్ట్ర నాయకత్వం సమర్థవంతమైన నేత భుజ స్కంధాలపై ఉండాలని పేర్కొన్నారు.
‘ప్రస్తుతం ప్రపంచంలో ఎంత అల్లకల్లోలం జరుగుతుందో మీరు చూస్తూనే వున్నారు. ఎప్పుడేమి జరుగుతుందో చెప్పలేని సంకట స్థితి. అందుకే భారత్ బలపడాలి కదా. ఇలా బలపడటం కేవలం భారత ప్రజల కోసమే కాదు.. ప్రపంచ మానవతా దృష్టితో చూసినా ఇది అత్యావశ్యకం. భారత్ బలపడాల్సిందే. మీరందరూ వేసే ఒక్కొక్క ఓటు భారత్ను బలపరుస్తుంది. కఠినమైన సమయాలు వచ్చినప్పుడు బలమైన నాయకుడే కావాలి. ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద రాష్ట్రం ఓ బలమైన, పటిష్టమైన నాయకుడి భుజ స్కంధాలపై ఉండాలి’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు.